వైస్సార్ సీపీలో నియంత పాలన చూసి విసిగి పోయామని సంక్షేమ పథకానికి లంచాలు ఇవ్వలేక తామంతా ఇబ్బందులు పడుతున్నామని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 30 కుటుంబాల వారు వాపోయారు. వారంతా నరసరావుపేట టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.
వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని చెప్పిన నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం చేయిచేయి కలిపి టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అలుపెరగని పోరాటం చేయాలని కోరారు. ఇప్పటికే ప్రజలు వైస్సార్ సీపీ పాలన పై విరక్తి చెందారని ప్రతి పనికి లంచం అనే నినాదంతో ప్రభుత్వం పని చేస్తుందని ఆయన విమర్శించారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైస్సార్ సీపీ నాయకులు వివక్ష చూపుతున్నారని రాక్షస పాలనను ప్రత్యక్షంగా చూస్తున్నామని ప్రజలు తమకు తెలిపి వాపోతున్నారని చదలవాడ అన్నారు. అందరు చంద్రన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఒక్క అవకాశం అంటూ అధికారంలోకొచ్చిన వైస్సార్ సీపీ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శేఖర్, వల్లెపు నాగేశ్వరరావు, కొల్లి బ్రహ్మయ్య, అల్లంశెట్టి మోహన్ రావు, బొప్పూడి శీను, నరిశెట్టి శర్మ తదితరులు పాల్గొన్నారు.