ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు పరచడమే కాక అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాలు పేరుతో ఆనందాన్ని ఇచ్చారని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి, సౌమ్యనాథ స్వామి దేవస్థానం చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంసిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని అన్ని వర్గాల ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ నెలాఖరులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అందర్నీ అత్యధిక మెజారిటీతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా ప్రజలంతా ఆశీర్వదించాలని ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో నందలూరు మండలంలోని ఏకైక జడ్పిటిసి స్థానాన్ని, 11 ఎంపీటీసీ స్థానాలను వైసిపి ఏకగ్రీవంగా కైవసం చేసుకోబోతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ కార్యదర్శి అజీజ్, మండల యూత్ మైనారిటీ కన్వీనర్ ఇబ్బు, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు బ్యాంకు నారాయణ తదితరులు పాల్గొన్నారు.