రాజధాని ప్రాంతంలో అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీరని పరాభవం ఎదురైంది. స్థానికంగా ఉన్న రెండు ఎస్ సి వర్గాల మధ్య తలదూర్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మహిళ మరణానికి కారణం అయ్యారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాంతో నేడు అక్కడి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. క్రిస్మస్ స్టార్ గుర్తు ఏర్పాటు చేయడం, ఆర్చి నిర్మాణం తదితర అంశాలపై గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో గత మూడు రోజులుగా వివాదం కొనసాగుతోంది.
ఈ వివాదం ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మించి దానికి జగజ్జీవన్రామ్ కాలనీగా పేరు పెట్టాలని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ నిర్ణయంపై ఎస్ లలోని మాల వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అక్కడ చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసినట్లుగా సమాచారం.
గత రాత్రి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. పలువురు గాయపడ్దారు. వారిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. మృతురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు.
ఘర్షణల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి చేరుకున్నారు.
మృతురాలి కుటుంబ సభ్యులను, ఘర్షణలో గాయపడినవారిని పరామర్శించారు. మరియమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. హోమ్ మినిష్టర్ సుచరిత,ఎంపీ నందిగం సురేష్ వెలగపూడి గ్రామంలో జరుగుతున్న రాస్తారోకో వద్దకు చేరుకోగా వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
మృతురాలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేస్తూ డౌన్, డౌన్ నందిగామ సురేష్ అంటూ స్లొగన్స్ ఇచ్చారు.