జగన్ మోహన్ రెడ్డి చిటికేస్తే రాష్ట్రం ఏమౌతుందో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కి రండి అని లోకేష్ సవాల్ విసురుతున్నాడని, ముందు ఆయన కనీసం వార్డు కౌన్సిలర్ గా ఐనా గెలిచి అప్పుడు సవాల్ కి రావాలని ఆయన అన్నారు. నరసరావుపేట లో రెండో రోజు జనాగ్రహ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుండి విజయవాడ పారిపోయివచ్చిన వ్యక్తి చంద్రబాబునాయుడని ఆయన అన్నారు.
సీబీఐ రాష్ట్రానికి రావటానికి వీల్లేదని జీవో తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతున్నాడని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పరిపాలనలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి తనకు అనూకూలంగా మల్చుకునే వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు తన నాయకులతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తూ కుయుక్తులు పన్నుతున్నాడని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కండ్లగుంట్ల లో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన తీరు వెంటనే తెలిసుంటే అప్పుడే అడ్డుకునే వాళ్ళం అని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు వైయస్సార్సిపి నాయకులు, ఎంఐఎం పార్టీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, అభిమానులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.