వైసీపీ అధికార బలంతో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలను టార్గెట్ చేసుకున్నది. కుప్పంలో చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అని తలపడటానికి ముందు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కెలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబం లో పంచాయితీ పెట్టింది.
అచ్చెన్నాయుడి సోదరుడి కుమారుడిని ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా బెదిరించారనే ఆరోపణలతో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇక పంచాయతీ ఎన్నికలు ముగిసి, తాజాగా మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.
తాజాగా అచ్చెన్నాయుడుపై సోదరుడి కుమారుడు అప్పన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పంచాయితీ ఎన్నికల్లో నిమ్మాడ సర్పంచ్గా పోటీ చేసినందుకు తనను, కుటుంబాన్ని వెలివేశారని ఆరోపించారు. అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్.. అతడి కుమారుడు సురేష్ పొలంలోకి కూలీలను రానివ్వకుండా అడ్డుపడుతున్నారుని.. పొలంలోకి వెళ్ళేందుకు దారి ఇవ్వడం లేదన్నారు.
కూలీలు రాక రెండు ఎకరాల్లో మినప చేను పోయిందని.. ఊరిలో మిల్లుకు వెళ్ళి ధాన్యం ఆడించుకోలేని పరిస్ధితి ఉందన్నారు. గ్రామంలోని రజకులను, నాయీ బ్రహ్మణులను కూడా తన ఇంటికి రానివ్వడం లేదని అప్పన్న అంటున్నారు.
తమ కుటుంబ సభ్యులతో కూడా ఎవ్వరూ మాట్లాడడం లేదని.. తనను చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నేళ్ళు నిమ్మాడలో వారి రౌడీ పాలన కొనసాగుతుందని.. ప్రజాస్వామ్యం లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. నిమ్మాడలో తమకు జరుగుతున్న అన్యాయం పై పోలీసులను ఆశ్రయిస్తానని ఆయన అన్నారు.