మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జడ్పిటిసిలను శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుమల ఫంక్షన్ హాల్ లో జిల్లా పరిషత్ అధ్యక్షతన జరిగిన నాగర్ కర్నూల్ జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధి సమావేశాలకు జడ్పిటిసి సభ్యలను ఆహ్వానించడం లేదని తమకు ఫిర్యాదులు అందాయని నేటి నుండి వారిని శాశ్వత సభ్యులుగా ప్రకటిస్తున్నందున సహకార శాఖ, మార్కెటింగ్ తదితర అన్ని మండల స్థాయి సమావేశాలకు జడ్పిటిసిలను విధిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా సభ్యుల కోరిక మేరకు నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. అన్ని జిల్లాలలో నడుస్తున్నట్లుగా నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం మన ఇసుక వాహనం ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని , కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల రిజర్వాయర్ ముంపులో భూములు కోల్పోయిన వారిలో కొంతమందికి నేటికి నష్టపరిహారం అందలేదని సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని వీటి పై పూర్తి వివరాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా ఇంతవరకు బిల్లులు పెండింగులో ఉన్న రైతు వేదికల, వైకుంఠ ధామాల వివరాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు మండలానికి కనీసం ఒకటి వీలు ఉంటే మరిన్ని ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసేందుకు మార్చి నుండి నిధులు విడుదల చేయనున్నట్లు నవంబర్ నుండి అమలు చేసేవిధంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. కొత్త గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు ఎన్. ఆర్.ఈ.జి.యస్. మెటీరియల్ కంపోనెంట్ కింద గ్రామ పంచాయతీల నిర్మాణాలు చేపట్టేందుకు తీర్మానం చేయాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేస్తే స్వయం తృప్తిఉంటుందన్నారు.
సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పి చైర్మన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ అధికారులు సభలో చర్చించిన అంశాలు, సమస్యల పై చర్యలు తీసుకొని సభ్యులకు అట్టి సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, కనీసం ప్రజాప్రతినిధులు సూచించే పనులపై సైతం స్పందించడం లేదని విద్యుత్ శాఖ అధికారిని నిలదీశారు. సభలో వ్యవసాయం, పంచాయతీరాజ్, మైన్స్, విద్యుత్ తదితర కీలక శాఖల పై సమీక్ష నిర్వహించారు.
సమావేశానికి హాజరైన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన దళిత బంధు పథకం పై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతా తీర్మానం సభలో ప్రవేశ పెట్టగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు బలపరచారు. తీర్మానం ఆమోదిస్తున్నట్లు జడ్పి చైర్మన్ ప్రకటించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ వివిధ శాఖల పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాఖల తరపున వివరణలు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుండి మన ఇసుక వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు ఇసుకను అందించేందుకు మన ఇసుక వాహనం కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఏ.డి. మైన్స్ అధికారిని ఆదేశించారు.
ఆరోగ్య శాఖ సమీక్ష సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ మూడవ వేవ్ వచ్చినా తట్టుకునేందుకు జిల్లా ఆరోగ్య శాఖ సన్నందంగా ఉన్నట్లు వెల్లడించారు. అన్ని రకాల మౌళిక సదుపాయాలు సమకూర్చుకున్న ట్లు ఆయన తెలిపారు. స్వచ్చంద సంస్థలు ఐ.సి.యు. బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, తదితర మౌళిక సదుపాయాలు ఉచితంగా సమకుర్చామని, విద్యుత్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని పల్లె, పట్టణ ప్రగతిలో గుర్తించిన విద్యుత్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
సభలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు అనేక అంశాలపై సమస్యలు లేవనెత్తారు. వీటికి అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో మండలి సభ్యులు విప్ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు యం. జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మను చౌదరి, జడ్పి సి.ఈ.ఓ ఉషా, జడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, అందరూ జడ్పిటిసిలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.