దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో సౌకర్యాలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పించడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.
ఇందులో భాగంగా తిరుపతిలో అన్ని సౌకర్యాలతో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 150 బస్సులు నిలిపి ఉంచేలా బస్ బే ఉండాలని సూచించారు. హెలిప్యాడ్తో పాటు..రోప్ వే, వాణిజ్య కాంప్లెక్స్లు, మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు ఉండాలని పేర్కొన్నారు.
తిరుపతిలో బస్టాండ్ నిర్మాణంపై జాతీయ రహదారుల సరకు రవాణా నిర్వహణ సంస్థ, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం సమీక్షించారు. 13 ఎకరాల్లో నిర్మించే బస్ స్టేషన్.. రోజుకు లక్ష మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుండాలి.
బస్సులు వచ్చేందుకు, వెళ్లేందుకు రెండేసి చొప్పున మార్గాలు ఏర్పాటు చేయాలి. బస్టాండ్కు అవసరమైన విద్యుత్తు కోసం సోలార్ రూఫ్ టాప్ ఉండాలని సూచించారు చంద్రబాబు భవిష్యత్తులో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడుపుతామని చెప్పారు. ప్రతి బస్సుకూ ఛార్జింగ్ సౌకర్యం కల్పించాలన్నారు
రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లనూ ఆధునికీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు చంద్రబాబు. బస్ స్టేషన్కు సంబంధించి ఐదు నమూనాలను సీఎం పరిశీలించారు. వాటిని ఇంకా అభివృద్ధి చేసేందుకు భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు.