అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 17 నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబరు 16న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.
యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన సెప్టెంబరు 17న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 18న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు సెప్టెంబరు 19న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జరుగనుంది. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.