ఏపీ ఆర్థిక, ఐటీ రాజధాని విశాఖపట్నం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ చోటు దక్కించుకుంది. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక గురువారం రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా దాదాపు 31 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. దాదాపు 13 వేల మంది మహిళల నుంచి శాంపిల్స్ సేకరించారు.
ఈ నివేదికలో జాతీయ భద్రతా స్కోరును 65 శాతంగా పేర్కొంది. దీనికి ఎగువన ఉన్న నగరాలను సురక్షితమైనవిగా, దిగువన ఉన్న వాటిని భద్రత లేనివిగా వర్గీకరించింది. ఈ రిపోర్టు ప్రకారం లింగ సమానత్వం, పౌర భాగస్వామ్యం, మెరుగైన పోలీసుశాఖ పనితీరు, మహిళలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలతో కోహిమా ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులో నిలిచింది.
బలహీన సంస్థాగత ప్రతిస్పందన, పితృస్వామ్య నిబంధనలు, పట్టణ మౌలిక సదుపాయాల అంతరాలతో పట్నా, జైపుర్ వంటి నగరాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో విశాఖ, భువనేశ్వర్, కోహిమా, ఐజ్వాల్, ఈటా నగర్, ముంబై, గాంగ్ టాక్లు మహిళలకు దేశంలో అత్యంత సురక్షితమైన నగరాలుగా నిలవగా..పట్నా, జైపుర్, ఫరిదాబాద్, దిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీలు భద్రత లేని ప్రాంతాలుగా ఉన్నాయి.
నివేదికను విడుదల చేస్తున్నప్పుడు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయా రహత్కర్ మాట్లాడుతూ.. మహిళల క్షేమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడలేమని, అది స్త్రీ జీవితంలోని విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, స్వేచ్ఛ వంటి ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.
మహిళల భద్రత కోసం ప్రత్యేకగా శక్తి యాప్ను తీసుకువచ్చింది. ఇక ప్రజా రవాణాలో మహిళల సెక్యూరిటీ కోసం గతంలో ప్రారంభించిన అభయం ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మహిళలు, బాలికలపై వేధింపులు, నేరాలను నివారించడానికి, అవసరమైనప్పుడు తక్షణ సహాయం, రక్షణ అందించడానికి శక్తి టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్లు బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తాయి.