వైసీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. ఐదేళ్లలో ఆ పార్టీ అధినేత నుంచి కిందిస్థాయి నేతల వరకు తోచిన రీతిలో వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, లిక్కర్, కాంట్రాక్టులు ఇలా అన్ని రకాలుగా దోచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ కసితో ఉన్నారు. జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా 2029లో వచ్చేది మనమే, మన ప్రభుత్వమే రాబోతుందంటూ కార్యకర్తలను ఊరిస్తున్నారు.ఐతే ఆ పార్టీ కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు మాత్రం…ఉచిత సేవ చేయాలని కోరుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చర్చనీయాంశమైంది.
వైసీపీకి జిల్లాల వారీగా మేనేజర్లు వున్నారు. పార్టీ ఆదేశాల్ని నాయకులకు పంపుతూ, కార్యక్రమాల వివరాల్ని అధిష్టానానికి పంపడం మేనేజర్ల బాధ్యత. వీరికి ప్రతినెలా వేతనం కూడా ఇస్తుంటారు. మేనేజర్లు ఉంటారనే విషయం కార్యకర్తలకు తెలియదు. మేనేజర్లకు ప్రతి నెలా రూ.10 లక్షల వరకు వారి వేతనాల ఖర్చు వుంటుంది.ఐతే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మేనేజర్లను తాడేపల్లికి పిలిపించుకున్నారు. మేనేజర్లతో ఆలూరు సాంబశివారెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీ ఆర్థిక ఇబ్బందుల్లో వుందని, ఇకపై జీతాలు ఇవ్వలేమని చావు కబురు చల్లగా చెప్పినట్టు తెలిసింది. వైఎస్ జగన్, వైసీపీపై ప్రేమ వుంటే, మేనేజర్లుగా ఉచిత సేవలందించాలని, లేదంటే మీ దారి మీరు చూసుకోవాలని సాంబశివారెడ్డి కఠినంగా చెప్పారని సమాచారం.
ఐదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన వైసీపీ నేతలు అడ్డగోలుగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. కానీ వైసీపీ ప్రతిపక్షంలోకి రాగానే, బీద అరుపులు అరవడం ఆశ్చర్యం కలిగిస్తుందని కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఐదేళ్ల పాటు దోచుకున్న వేల కోట్లలో కనీసం 1 పర్సెంట్ ఐనా పార్టీ కోసం ఖర్చు పెట్టకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలా కలలు కంటున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ఇదే తీరు కొనసాగిస్తే ప్రస్తుతం మార్చురీలో ఉన్న వైసీపీ కాస్త పాడె ఎక్కడం ఖాయమంటున్నారు. డబ్బు ఖర్చు విషయంలో వైసీపీ నేతల తీరును చూసి ఆ పార్టీ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న నాడు కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడైనా పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించి వారి కష్టానికి విలువ ఇవ్వాలని కోరుతున్నారు.