అమరావతిలో మరో ఐటీ కంపెనీ కొలువుదీరింది. కేసరపల్లి ఏపీఐఐసీ- ఏస్ అర్బన్ హైటెక్ సిటీలోని మేథ టవర్ ఒకటవ అంతస్తులో బాన్బ్లాక్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేసినట్లు సీఈవో సౌరి గోవిందరాజన్ వెల్లడించారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 300 ఉద్యోగాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాన్బ్లాక్ కంపెనీ ఫార్మా, హెల్త్, ఆటోమేటివ్, రిటైల్, ఆహార రంగాల్లో సేవలందించనున్నట్లు తెలిపారు.
త్వరలోనే బాన్బ్లాక్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా మారిన బ్లాక్ చైన్ కంపెనీలలో బాన్బ్లాక్ సంస్థ మొదటి పది సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. అమెరికాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న బాన్బ్లాక్ను ఆంధ్రప్రదేశ్లోనూ విస్తరించడం గర్వంగా ఉందని సీఈవో గోవిందరాజన్ తెలిపారు. తమ కస్టమర్లకు తక్కువ సమయంలో నాణ్యమైన సాఫ్ట్ వేర్ సేవలను ఎక్కువ ఖర్చులేకుండా అందించడమే తమ లక్ష్యమన్నారు.
పది మంది కూర్చునే విధంగా బోర్డు రూమ్, చర్చలు, సమావేశాలకు మరో పెద్ద గది, ఇద్దరు మేనేజర్లు కూర్చునే విధంగా క్యాబిన్లు, 60 వర్క్ స్టేషన్లు, ఒక సెక్యూర్ సర్వర్ రూమ్, ఉద్యోగుల సౌకర్యార్థం రిసెప్షన్, ప్రైవేట్ ప్యాంట్రీ వంటి వసతులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దామని సీఈవో తెలిపారు. సంస్థ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం మరువలేనివన్నారు. ఈ కంపెనీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ ప్రాజెక్టుల విషయంలో కస్టమర్లకు సంతృప్తికర సేవలందిస్తామన్నారు.
స్త్రీ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా బాన్బ్లాక్ పైలట్ ప్రాజెక్ట్
స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంగా బాన్బ్లాక్ టెక్నాలజీస్ రూపొందించిన ‘స్పాట్ బస్ ఐవోటీ డివైజ్’ను పైలట్ ప్రాజెక్టు కింద ఆర్టీసీ బస్సుల్లో అమరుస్తున్నట్లు సీఈవో గోవిందరాజన్ వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతులమీదుగా ప్రారంభించే బస్సుల్లో ఈ డివైజ్ లు పని చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ పరికరాల ద్వారా ఆర్టీసీ బస్ కదలికలను ప్రత్యేకంగా అమర్చిన 360 డిగ్రీల కెమెరా ద్వారా రియల్ టైమ్ లో పర్యవేక్షణకు ఆ డివైజ్ లు ఉపయోగపడతాయన్నారు. నిఘా, అత్యవసర సేవలు, భద్రత, బస్సు నిర్వహణకు అవసరమైన డేటా మేనేజ్ మెంట్ విషయంలో పరికరాలు సహకారిస్తాయన్నారు. మహిళా సాధికారత, ప్రజా సేవకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలందించి రాష్ట్ర ఆవిష్కరణలలో కీలకమవుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యంలో తామూ భాగస్వామ్యమవుతున్నందుకు గర్వంగా ఉందని సీఈవో గోవిందరాజన్ వెల్లడించారు. ఐటీ రంగం సహా అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్న ఏపీకి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్బ్లక్ సంస్థకు చెందిన కార్పొరేట్ సర్వీసెస్ డైరెక్టర్ జమునాదేవి దయానిధి, పబ్లిక్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ సాయిరాం మత్తి పాల్గొన్నారు