అమరావతి ( వేంకటపాలెం) శ్రీ వేంకటేశ్వరసస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది.
ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు.
ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
21వ తేదీన ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమములు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, సందీప్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.