తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
రోజు రోజుకూ మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్వేర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.
రియల్ టైమ్లో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో ఎల్&టీ సిబ్బందితో కూడా టెక్నాలజీ వినియోగంపై చర్చించారు.
అనంతరం ఈవో లగేజీ కౌంటర్ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. దర్శన టోకెన్ పొందిన సమయం, దర్శనం పూర్తైన సమయాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీవారి దర్శనం టీటీడీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులతో మాట్లాడారు. భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఆర్వో డాక్టర్ టి.రవికి సూచించారు.
ఈ తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డా. మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.