వైసీపీ ఎంపీ, లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఈ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు రూ.4 వేల కోట్ల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A-4గా ఉన్న మిథున్ రెడ్డిని జులై 19న సిట్ అధికారులు అరెస్టు చేశారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. దాదాపు 71 రోజుల పాటు జైలులో ఉన్న మిథున్ రెడ్డికి ACB కోర్టు ఇటీవల రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి వంటి వారు బయటకు వచ్చారు. డిఫాల్ట్ బెయిల్ లభించింది వారికి. మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చారు. వీరి బెయిళ్లను రద్దు చేయాలని సిట్ హైకోర్టును ఆశ్రయించింది. నిందితులు బయట ఉంటే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ వాదిస్తోంది. దీనిపై కోర్టు విచారణ జరగనుంది.
ACB కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలున్నాయని సిట్ అధికారులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి వేసిన పిటిషన్లో తన నేర చరిత్ర వివరాలు పేర్కొనకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన 10 రోజులకే ACB కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. చట్ట నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను ACB కోర్టు తప్పుగా అన్వయించిందని తెలిపారు. బెయిల్ మంజూరు చేయడానికి ACB కోర్టు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని, ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉందని చెప్పారు. దీంతో..హైకోర్టు నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.