ప్రత్యేకం హోమ్

ట్రైలర్ రిలీజ్: మద్యం కుంభకోణంపై సంచలన చలన చిత్రం

#LiquorScam

ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన జగన్‌ రాష్ట్రంలో 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. అయితే ఆ నూతన పాలసీ ప్రకారం భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరోపణలు నిజమని తేలడంతో ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశారు. ‘‘బిగ్ బాస్’’ ఎవరో ఇప్పటి వరకూ స్పష్టంగా తెలియకపోయినా జగన్ రెడ్డి పేరును మాత్రం చార్జిషీట్ లో పేర్కొన్నారు కూడా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 చివర్లో రాష్ట్రంలో మద్యం విధానంలో మార్పులు చేశారు.

ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయిస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ నియంత్రణలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ద్వారా అమ్మకాలు జరిపారు. దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా కొనుగోలుదారులకు ఆసక్తి తగ్గించేందుకు అంటూ మద్యం ధరలను పెంచారు. ఆ మేరకు మద్యం ధరలు 2019 మే నాటికి ముందున్న ధరల కంటే ఒకటి రెండు రెట్లు పెరిగాయి.

అదే విధంగా గతంలో ఉన్న బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. మద్యం విక్రయాల్లో డిజిటల్‌ లావాదేవీలను రద్దు చేసి పూర్తిగా నగదు లావాదేవీలనే అనుమతించారు. వైఎస్సార్‌సీపీ అమలు చేసిన మద్యం విధానంపై అప్పటి విపక్షాలు మొదటి నుంచి విమర్శలు చేస్తూ వచ్చాయి. చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ మద్యం విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా గత ప్రభుత్వం మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. ఆ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. రూ.630 కోట్లు మాత్రమే డిజిటల్‌ అమ్మకాలు జరిగాయి. మద్యం అమ్మకాల ఇల్లీగల్‌ కలెక్షన్‌ ద్వారానే మొత్తంగా రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

ఐదేళ్లలో నాటి వైసీపీ పెద్దలు కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి అక్రమంగా లాభాలు ఆర్జించారు. నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులే బినామీల పేరిట మద్యం సరఫరా సంస్థలు ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఉన్న బ్రూవరీస్, డిస్టిలరీలను అడ్డగోలుగా లాక్కున్నారు. కొత్త బ్రాండ్‌ల పేరుతో చీప్‌ లిక్కర్‌నే తయారు చేశారు.

బెవరేజస్‌ కార్పొరేషన్‌ వద్ద 100 సంస్థలు నమోదై ఉండగా.. కేవలం పది పదిహేను కంపెనీలు మాత్రమే అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నాయి. మద్యం అమ్మకాల తతంగం మొత్తం నాటి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు నాటి ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కనుసన్నల్లోనే నడిచింది అని ‘సిట్’ పేర్కొన్నది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గనుల శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిల కనుసన్నల్లోనే మద్యం కుంభకోణమంతా జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు చేయడం, అడిగినంత కమీషన్‌ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా వీరిద్దరూ చేశారన్నది టీడీపీ నేతల ఆరోపణ.

నాడు వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను మిథున్‌రెడ్డి తన గుప్పిట్లోకి తెచ్చుకుని ఇక్కడ పెద్ద ఎత్తున మద్యం బ్రాండ్లను తయారు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఏపీఎస్‌బీసీఎల్‌ 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు మధ్య కేవలం 25 నెలల వ్యవధిలో ఏకంగా రూ.1800 కోట్ల విలువైన కోటి 16 లక్షల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ కంపెనీకి ఇచ్చింది. మొత్తంగా జగన్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఈ కంపెనీకి ఇచ్చిన మద్యం సరఫరా ఆర్డర్ల విలువ రూ. 6 వేల కోట్లపైనే ఉంటుందనేది అంచనా.

గత ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిన 2 నెలలకే తన అల్లుడైన పెనక రోహిత్‌రెడ్డి సన్నిహితులతో ఓ బినామీ మద్యం సరఫరా కంపెనీ పెట్టించి భారీగా లబ్ధి పొందారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. 2019 డిసెంబరు 2న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటైంది.

ఈ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను సబ్‌లీజు తీసుకుని ఆయా చోట్ల మద్యం బ్రాండ్లు తయారు చేయించారు. కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీకి కేవలం 25 నెలల వ్యవధిలో రూ.1,164 కోట్ల 86 లక్షల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. గత నాలుగున్నరేళ్లలో 4 వేల కోట్ల రూపాయలు విలువైన సరఫరా ఆర్డర్లు లభించాయన్న ఆరోపణలున్నాయి.

ఈ సంస్థ డైరెక్టర్లు కాశీచయనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుధ్‌రెడ్డిలు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సన్నిహితులు. రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా కొనసాగిన శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కాశీచయనుల శ్రీనివాస్‌ కొన్నాళ్ల పాటు డైరెక్టర్‌గా ఉన్నారు.

ముప్పిడి అనిరుధ్‌రెడ్డి.. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి తోడల్లుడు అవుతారు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి? ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం అమ్మాలన్నది రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందనేది ప్రధాన అభియోగం. అదాన్‌ కంపెనీ సరఫరా చేసిన అదాన్స్‌ సుప్రీమ్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ, 9 సీహార్సెస్‌ విస్కీ, ఏసీ బ్లాక్‌ రిజర్వు విస్కీ వంటి బ్రాండ్లను మాత్రమే కొన్నాళ్లపాటు దుకాణాల్లో అమ్మించారనేది ప్రధానమైన ఆరోపణ.

కసిరెడ్డిని ఏప్రిల్‌ 22న సిట్‌ అరెస్టు చేసింది. న్యాయస్థానాలు నిందితులకు బెయిల్ కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం కథాంశంగా చలన చిత్రం రాబోతున్నది. ఇండియా చరిత్ర లో ని జరిగిన అత్యంత పెద్ద లిక్కర్ కుంభకోణం మీద మూవీ తీశారు ఒక డైరెక్టర్. మూవీ ఇంకో 15 రోజుల్లో OTT ప్లాట్ ఫారంలో రాబోతున్నట్లు తెలిసింది.

Related posts

ఆంధ్రా అంటే తన జాగీరు అనుకుంటున్నాడు!

Satyam News

దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐలమ్మ

Satyam News

లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

Satyam News

Leave a Comment

error: Content is protected !!