తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి పండితుల వేద మంత్రాల నడుమ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తన మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలని తెలిపారు.
శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని చెప్పారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని, ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామని డీజీపీ తెలిపారు.
మావోయిస్టు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రకటన రిలీజ్ చేశారని.. బయటకు రావడానికి, ఆయుధాలు వదిలి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామంటూ ప్రకటన విడుదల చేశారన్నారు. జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నపుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారని చెప్పారు.
వేణుగోపాల్ ఇచిన స్టేట్మెంట్ను జగన్ ఖండించారని.. ప్రజా పోరాట పంథా సక్సెస్ అవల్లేదని మావోయిస్టులే అంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులు వేధిస్తారని భయం లేకుండా ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జన జీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
చాలా మంది ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వస్తున్నారని.. రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ కవితక్క కూడా లొంగిపోయారన్నారు. మావోయిస్టులతో తమకు ఇక్కడ సమస్య లేనప్పుడు వాళ్ళతో చర్చలు అనవసరమని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
బేసిక్ పోలీసింగ్ & విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తామన్నారు. ఇతరుల వ్యక్తిత్వ హనానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటాం అని నూతన డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు.