తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన..కేంద్రమంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనతో జగన్లో వణుకు మొదలైంది. ఇప్పటికే కేసుల భయంతో వణికిపోతున్న జగన్కు లోకేష్ ఢిల్లీ పర్యటన మరింత వణుకుపుట్టిస్తోంది. తన కేసుల ప్రస్తావన మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉందన్న టెన్షన్లో ఉన్నారు జగన్.
ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్..కేంద్ర ఐటీ – ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డా గారితో లోకేష్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని, రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేటాయించాలని ఆయన నడ్డాను కోరారు. లోకేష్ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన నడ్డా..ఈ నెల 21 నాటికి ఏపీకి 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏపీలో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సహకారం అందించాలని నడ్డాను లోకేష్ కోరగా..సానుకూలంగా స్పందించారు.
మరో కేంద్రమంత్రి జైశంకర్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఇటీవల సింగపూర్ పర్యటన అంశాలను కేంద్రమంత్రికి వివరించారు లోకేష్. కేంద్రమంత్రి సైతం లోకేష్తో సమావేశంపై ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక లోకేష్ మరికొంత కేంద్రమంత్రులతోనూ సమావేశం కానున్నారు. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, షిప్పింగ్- జలరవాణా మంత్రి సర్బానంద్ సొనోవాల్తోనూ లోకేష్ భేటీ కానున్నారు. ఈ నెల 21న సీఎం చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు.