తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన స్వగ్రామం తిమ్మంపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డిని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసి సంఘీభావం తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు తనను అన్యాయంగా నిర్బంధించారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.
రేపు హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటానని కేతిరెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా, తాడిపత్రిలో కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య రాజకీయ కలహాలు నువ్వా- నేనా అన్నట్లు సాగుతుంటాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సోమవారం నాడు పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని సూచనలు ఇచ్చింది.
మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టడంతో తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు భద్రత కల్పించాల్సిందిగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందనే అంచనాతో పోలీసులు శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ.. మేం ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేసీ వర్గీయులు పట్టుబట్టారు. దీంతో తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు భారీ బలగాలను మోహరించారు.
ఇంతకుముందు, పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును విచారించిన హైకోర్టు ఈనెల 18న తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక, గతంలో తమ ఆదేశాలు పాటించకపోవడంపై హైకోర్టు అనంతపురం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.