ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్కే దక్కుతుంది. ముఖ్యంగా 90వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కృషితో మైక్రోసాఫ్ట్లాంటి దిగ్గజ సంస్థ రావడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. సరిగ్గా అలాంటి చారిత్రక ఘట్టమే ఇప్పుడు తిరిగి విశాఖలో రిపీట్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఐటీ సేవల కేంద్రంగా నిలిస్తే, గూగుల్ వైజాగ్లో దాదాపు $10 బిలియన్ల భారీ పెట్టుబడితో, 1-గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక, సాంకేతిక చరిత్రకు మైలురాళ్లు.
హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రాకతో కేవలం ఉద్యోగాల సృష్టి మాత్రమే జరగలేదు. దాంతో పాటు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సహా ఇతర దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు రావడానికి కారణమైంది. అంతేకాదు మౌలిక వసతుల కల్పనతో పాటు స్టార్టప్ ఎకోసిస్టమ్కు పునాది వేసింది. మొత్తంగా హైదరాబాద్ను సాఫ్ట్వేర్ క్యాపిటల్గా మార్చింది. ఇదే తరహాలో ఇప్పుడు గూగుల్ వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా..వైజాగ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా హబ్గా మార్చాలని ఏపీ సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ యుగానికి తలుపులు తెరిస్తే, గూగుల్ ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది.
హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ యాంకర్ కంపెనీగా పనిచేసింది. అంటే, ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీ అక్కడ కార్యకలాపాలు ప్రారంభించడం వలన, ఇతర టెక్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులకు, కార్యకలాపాలకు అది సురక్షితమైన సిటీగా భావించాయి. ఇప్పుడు వైజాగ్కు గూగుల్ కూడా ఇదే రోల్ ప్లే చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో, వైజాగ్లో డేటా అనలిటిక్స్, క్లౌడ్ సేవలు, సైబర్సెక్యూరిటీ. AI పరిశోధనల రంగంలో అనేక అనుబంధ సంస్థలు, స్టార్టప్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.
మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్లో టెక్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఇదే తరహాలో గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, విద్యార్థులు, సాఫ్ట్వేర్ డెవలపర్లకు AI ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. లక్షల ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా, ఈ శిక్షణ కార్యక్రమాలు ఏపీ యువతను భవిష్యత్తు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేస్తాయి.
హైదరాబాద్ నుండి మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల సహకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇచ్చింది. అదే విధంగా, విభజన తర్వాత రాజధాని లేక, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు, గూగుల్ పెట్టుబడి ఒక బలమైన పునాదిగా, ఆశాజ్యోతిగా నిలుస్తోంది.