ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అక్టోబర్ నెల సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్..ఈ నెలలోనే తన కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. రుషికొండలోని మిలీనియం టవర్స్లో తాత్కాలికంగా కేటాయించిన భవనంలో TCS తన డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఇంటీరియర్ పనులు, కంపెనీ బోర్డు ఏర్పాటు వంటివి పూర్తి కావడంతో, తొలి దశలో సుమారు 2,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి రెడీ అయింది. ఇది ఏపీలో ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతకు గుడ్న్యూస్.
ఇక మరో గుడ్న్యూస్ ఏంటంటే..టెక్ దిగ్గజం గూగుల్ ఇదే నెలలో విశాఖలో అడుగుపెట్టబోతుంది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ గతంలో చేసిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 14 విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో ప్రభుత్వం చారిత్రక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనుంది. గూగుల్ సుమారు 6 బిలియన్ డాలర్లు అంటే రూ. 50 వేల కోట్లకు పైగా వ్యయంతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఈ మెగా పెట్టుబడి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది.
విశాఖపట్నం ఐటీ హిల్స్-3లోని మిలీనియం టవర్స్లో 2.08 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తాత్కాలిక కేంద్రంగా TCSకు కేటాయించారు. అయితే, టీసీఎస్ శాశ్వత ప్రాతిపదికన రుషికొండ ప్రాంతంలో 22 ఎకరాల స్థలంలో రూ. 1,370 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక క్యాంపస్ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ శాశ్వత క్యాంపస్ ద్వారా మొత్తం 12,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
TCS కార్యకలాపాల ప్రారంభం, గూగుల్తో మెగా డేటా సెంటర్ ఒప్పందం అనేవి కేవలం రెండు కంపెనీల రాక మాత్రమే కాదు. విశాఖ రూపురేఖలను శాశ్వతంగా మార్చే గేమ్ ఛేంజర్ అంటున్నారు నిపుణులు. పోర్టు సిటీ, స్టీల్ సిటీగా ఉన్న విశాఖ ఇకపై నాలెడ్జ్ ఎకానమీ సిటీగా మారడానికి ఈ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి. కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఇతర ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్గా వేగంగా అభివృద్ధి చెందనుంది.