జాతీయం హోమ్

మహిళా డాక్టర్ కు లైంగిక వేధింపులు: ఆత్మహత్య

#Doctor

మహారాష్ట్రలోని సాతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెనుక లైంగిక దాడి, వేధింపులు, అవినీతి వంటి అంశాలు దాగి ఉన్నాయని ఆమె ఆత్మహత్యా వదిలి వెళ్లిన నాలుగు పేజీల చీటీలో బయటపడ్డాయి.

ఫల్టన్ ఉప జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారిగా పని చేస్తున్న ఆ యువ వైద్యురాలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాల్‌ బడ్నే తనపై ఐదు నెలలుగా లైంగిక, మానసిక, శారీరక వేధింపులు జరిపారని ఆరోపించారు. బడ్నే తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని తన ప్రాణాలు తీసుకునే ముందు తన చెయ్యిపై “నా మీద బడ్నే అత్యాచారం చేశాడు” అని రాసి ఉంచిందని పోలీసులు తెలిపారు.

ఆమె వదిలిన ఆత్మహత్యా లేఖలో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. పలువురు పోలీస్ అధికారులు, ఒక ఎంపీ, ఆయన వ్యక్తిగత సహాయకులు కలిసి నిందితులపై నకిలీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వమని తనపై ఒత్తిడి తీసుకువచ్చారని, తాను నిరాకరించడంతో వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది.

దాదాపు రెండేళ్లుగా గ్రామీణ ప్రాంతంలో సేవలందిస్తున్న ఆ వైద్యురాలు, తన బాండ్‌ పీరియడ్‌ ముగియడానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉండగా, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదవాలన్న కలతో ముందుకు సాగుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ఆమె బంధువు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు ఈ విషయాన్ని ఎన్నో సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP), డిప్యూటీ సూపరింటెండెంట్ (DSP)లకు పత్రాలు రాసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. “తనకు ఏదైనా జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె ముందే స్పష్టంగా రాసి ఉంచింది” అని ఒక బంధువు తెలిపాడు.

లేఖలో ఆమె తన ఇంటి యజమాని ప్రశాంత్‌ బాంకర్‌ నుండి కూడా మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ఆమె మరణం తర్వాత సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాల్‌ బడ్నే, ప్రశాంత్‌ బాంకర్‌లపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి కేసులు నమోదు చేయగా, బడ్నేను సస్పెండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కొల్హాపూర్‌ డివిజన్‌ ఐజీ సునిల్‌ ఫులారి మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ ఘటన రాజకీయ రంగంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ నాయకుడు విజయ్‌ వడేట్టివార్‌ మాట్లాడుతూ, “ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన పోలీసులు దోపిడీదారులుగా మారితే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? బాధితురాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యం” అని ఆరోపించారు.

దీనిపై స్పందించిన బీజేపీ నాయకురాలు చిత్రా వాఘ్‌ ఈ ఘటనను దురదృష్టకరమని పేర్కొంటూ, న్యాయసమ్మతమైన, సమగ్ర దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చారు. మహిళలు ఇలాంటి ఘటనలను 112 హెల్ప్‌లైన్‌ ద్వారా వెంటనే తెలియజేయాలని ఆమె పిలుపునిచ్చారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఆత్మహత్యకు ముందు బాధితురాలు ఒక నిందితుడితో మాట్లాడినట్లు తెలిసింది. ఆమె పుణేలో పనిచేస్తున్న ప్రశాంత్‌ బాంకర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడడమే కాక, మొబైల్‌ ద్వారా సందేశాలు కూడా మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె నివసించిన ఫ్లాట్‌ బాంకర్‌ తండ్రి సొంతమని, ఆయన ఒక పోలీసు అధికారి అని కూడా విచారణలో బయటపడింది.

బాధితురాలి బంధువులు చెబుతున్నట్లుగా, ఆమెను పోలీస్ అధికారులు వైద్య రిపోర్టులను తారుమారు చేయమని ఒత్తిడి తెచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వేధింపులకు గురయ్యే మహిళలకు భద్రత కల్పించాలన్న డిమాండ్ చేస్తున్నారు.

Related posts

అంతరించిపోతున్న నాటక రంగానికి ఊపిరి

Satyam News

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

Satyam News

పోర్టుల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు!

Satyam News

Leave a Comment

error: Content is protected !!