పెన్సిల్వేనియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల భారత సంతతి మోటెల్ యజమాని రాకేష్ ఎహగబన్ శుక్రవారం రాత్రి కాల్పులకు బలయ్యారు. తన మోటెల్ పరిసరాల్లో గందరగోళం జరుగుతుండటంతో బయటికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తుండగా ఈ దారుణం జరిగింది. సమాచారం ప్రకారం, రాకేష్ ఎహగబన్ “Are you alright, bud?” అని అనుమానితుడిని అడగగానే, ఆ వ్యక్తి తుపాకీతో ఆయన తలపై కాల్పులు జరిపి చంపేశాడు.
37 ఏళ్ల స్టాన్లీ యూజిన్ వెస్ట్ ఈ కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. సుమారు రెండు వారాలుగా అతను ఒక మహిళ, ఒక చిన్నారితో కలిసి మోటెల్లో ఉండేవాడు. రాకేష్పై దాడి చేయడానికి ముందు, వెస్ట్ తన భాగస్వామి అయిన మహిళపై కూడా కాల్పులు జరిపాడు. ఆ మహిళ కారులో చిన్నారితో కూర్చుని ఉండగా, వెస్ట్ ఆమె మెడపై కాల్పులు జరిపాడు. గాయపడిన ఆమె తీవ్ర పరిస్థితిలో ఉన్నప్పటికీ ధైర్యంగా కారు నడిపి సమీపంలోని ఆటో రిపేర్ షాపుకు వెళ్లింది. అక్కడి సిబ్బంది సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
రాకేష్ ఎహగబన్ను చంపిన అనంతరం, వెస్ట్ సమీపంలోని యూ-హాల్ వ్యాన్ లోకి వెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్ది గంటల తర్వాత పోలీసు బృందాలు అతన్ని పిట్స్బర్గ్ ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో గుర్తించాయి. అక్కడ పోలీసులు, వెస్ట్ మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పిట్స్బర్గ్ డిటెక్టివ్ గాయపడ్డాడు. వెస్ట్ కూడా కాల్పుల్లో గాయపడి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్పై హత్య, హత్యాయత్నం, నిర్లక్ష్యంగా ఉండి ఇతరకుల ప్రమాదం కలిగించడం వంటి అనేక నేరాలపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
టెక్సాస్లో మరో భారతీయుడి హత్యకు నెల రోజులే…
టెక్సాస్లో భారత సంతతి మోటెల్ మేనేజర్ హత్యకు గురైన నెల రోజుల లోపునే మరో భారత సంతతి మోటెల్ మేనేజర్ హత్యకు గురి కావడం సంచలనం కలిగిస్తున్నది. నెల రోజులు ముందు, టెక్సాస్లో మోటెల్ మేనేజర్ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అక్కడ ఒక సహోద్యోగి వాషింగ్ మెషిన్పై తలెత్తిన వివాదం కారణంగా మేనేజర్ను తల నరికి చంపాడు. ఆ నిందితుడు అరెస్టయి మర్డర్ కేసులో నిర్బంధంలో ఉన్నాడు. ఇలాంటి వరుస హత్యలు అమెరికాలోని భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.