పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై తెగబడితే కచ్చితమైన సమాధానం చెబుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటు హెచ్చరిక చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులను గట్టిగా హెచ్చరించారు.
భారత్పై మళ్లీ దాడులు చేస్తే “గొలీకి గోలాతో సమాధానం ఇస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. బీహార్లోని దర్బంగా, మోతిహారి, బేటియాలో వరుసగా నిర్వహించిన సభల్లో ప్రసంగించిన అమిత్ షా, “పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో మన పౌరులపై దాడి చేసి, మా తల్లులు, అక్కాచెల్లెమ్మల నుదుటి సిందూరాన్ని తుడిచేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 20 రోజుల్లోనే ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఆ దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు.
భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోనే ఉగ్రవాదులను అంతమొందించింది,” అని చెప్పారు. అమిత్ షా మాట్లాడుతూ, “ప్రధాని మోదీ బీహార్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ తప్పు చేస్తే, గొలీలకు గోలాలతో సమాధానం ఇస్తాం. ఇకపై ఉగ్రవాదులపై ఉపయోగించే తుపాకీ గోలాలు ‘మేడ్ ఇన్ బీహార్’ అవుతాయి,” అని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో దేశ భద్రతకు పెద్దపీట వేయలేదని ఆరోపించిన ఆయన, “మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మాత్రం దేశ భద్రతకు అంకితభావంతో కృషి చేస్తోంది. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో మేము ఎలాంటి రాజీ పడము,” అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్లపై అమిత్ షా విరుచుకుపడ్డారు.
“ఆ ఇద్దరూ సివాన్ ప్రాంతంలో భయాందోళన సృష్టించిన గ్యాంగ్స్టర్-నేత మొహమ్మద్ షహాబుద్దీన్ను కీర్తిస్తూ ‘షహాబుద్దీన్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేయడం సిగ్గుచేటు. ఆర్జేడీ మళ్లీ ‘జంగిల్ రాజ్’ కలలు కంటోంది, కానీ బీహార్ ప్రజలు దాన్ని అస్సలు అనుమతించరు,” అని అన్నారు.
బీహార్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, “ఆర్జేడీ పాలనలో బీహార్ చీకట్లో మునిగిపోయింది. మళ్లీ ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే, ఈవీఎంలో భాజపా గుర్తు ‘కమల పువ్వు’ బటన్ నొక్కి ఓటు వేయండి,” అని పిలుపునిచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలతో బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
