పంజాబ్ లో 90 శాతం మంది కరెంటు బిల్లు కట్టడం లేదు. ఇది నిజంగా నిజం. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం 2022 జూలై 1 నుంచి అమలు చేస్తున్న నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం క్షేత్రస్థాయిలో సానుకూల ఫలితాలు అందిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 90 శాతం గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లు సున్నాగా వస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలో వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు గతంలో తరచూ అనూహ్య విద్యుత్ కోతలు ఎదురయ్యేవి. అయితే ప్రస్తుతం విద్యుత్ సరఫరా, పరిపాలనా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం ద్వారా గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా నిరంతర విద్యుత్ సరఫరా అందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని, వ్యాపార కార్యకలాపాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొంది.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన పంజాబ్లో రైతులకు విద్యుత్ ఎంతో కీలకమైనది. వ్యవసాయ రంగానికి ఉచితంగా, నిరంతరాయంగా విద్యుత్ అందించాలన్న హామీని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని తెలిపింది. వరి సాగు, పంట పెరుగుదల దశల్లో ట్యూబ్వెల్స్కు రోజుకు ఎనిమిది గంటలకు పైగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
రైతులకు మరో కీలకమైన ఉపశమనం లభించింది. గతంలో పొలాలకు నీరు పెట్టేందుకు రాత్రి వేళల్లో మేల్కొని విద్యుత్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం పగటి సమయంలోనే వ్యవసాయ విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవడంతో రైతులకు రాత్రిపూట పొలాల్లో ఉండాల్సిన అవసరం తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది.
నిరంతర విద్యుత్ సౌకర్యాలను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 540 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ‘గోయింద్వాల్ సాహిబ్ థర్మల్ పవర్ ప్లాంట్’ను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని తెలిపింది. ఈ ప్లాంట్ కొనుగోలుతో పంజాబ్ సొంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని పేర్కొంది.
పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) పనితీరును మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్, రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్ సరఫరా, పరిశ్రమలకు అంతరాయం లేని విద్యుత్, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే చర్యలు ఇవన్నీ కలిపి పంజాబ్ విద్యుత్ రంగంలో కీలక మార్పులకు దారితీస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయిని సమర్థంగా వినియోగిస్తున్నామనడానికి ఈ చర్యలు నిదర్శనమని తెలిపింది.
