క్రిటికల్ మినరల్స్, ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతల రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మోనాష్ యూనివర్సిటీ డీన్, ఇతర ఉన్నతాధికారులతో మహాత్మా జ్యోతిరాపు ఫూలే ప్రజాభవన్ లో సమావేశమయ్యారు. సమావేశంలో ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనను వేగవంతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరిస్తున్న తరుణంలో క్రిటికల్ మినరల్స్ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. తెలంగాణ కేవలం వీటికి వినియోగదారుగా మాత్రమే ఉండకూడదని, మొత్తం విలువ శృంఖలిలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు.
అకడమిక్ భాగస్వామ్యాన్ని కేవలం పరిశోధనకే పరిమితం చేయకుండా, వాణిజ్య స్థాయిలో విస్తరించగల సాంకేతికతల అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరగా రూపొందించాలని అధికారులను కోరారు. తెలంగాణను క్రిటికల్ మినరల్స్ పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధికి వేదికగా మలచాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి సంస్థలను సమన్వయం చేయడం ద్వారా ఖనిజాల అన్వేషణ, మినరల్స్ వెలికితీత, శుద్ధి సాంకేతికతలు, వ్యర్థాల నుంచి క్రిటికల్ మినరల్స్ను తిరిగి పొందే విధానాలపై దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కొరతను అధిగమించడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో డీప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణభాస్కర్, మోనాష్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ యాయిన్నిస్ వెంటికోస్, ఆస్ట్రేలియా–ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ మోహన్ ఎల్లిషెట్టి, ప్రొఫెసర్ రామన్ సింగ్, సింగరేణి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
