తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాలకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.
వైకుంఠద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ విధానం ద్వారా టోకన్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన ఏడు రోజుల పాటు సామాన్య భక్తులకు ఎలాంటి టోకన్లు అవసరం లేకుండా సర్వదర్శనం ద్వారా వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాట్లు, సదుపాయాలపై తాను నిరంతరం పర్యవేక్షణ చేస్తానని చైర్మన్ తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం అన్నీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. రేపు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుండగా, ఈ సమావేశంలో సుమారు 50 అజెండా అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను (Pilgrim Amenities Complexes) అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
ఇటీవల రూ.9 కోట్లను దాత విరాళంగా అందజేశారని వెల్లడించారు. ఆలయ ధ్వజస్తంభాల అవసరాల కోసం టీటీడీ స్వయంగా 100 ఎకరాల్లో దివ్యవృక్షాల పెంపకాన్ని చేపట్టాలని భావిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఇందుకు అనువైన స్థలంగా పలమనేరులోని టీటీడీ గోశాల ఆవరణను గుర్తించినట్లు చెప్పారు.
ఈ దివ్యవృక్షాల ప్రాజెక్టుపై రేపు జరగనున్న పాలకమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఏడు నెలల అవసరాలకు సరిపడా బ్లేడులను ప్రముఖ బ్లేడు తయారీ సంస్థ ఈ నెల 17వ తేదీన విరాళంగా అందజేయనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
