ఇజ్రాయెల్, అమెరికా దళాలు మళ్లీ ఇరాన్ పై యుద్ధం ప్రారంభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్లో జరిపిన దాడుల్లో ప్రభుత్వ దళాలకు చెందిన కనీసం నలుగురు సైనికులు మృతి చెందగా, మరో 20 మంది గాయపడినట్లు ఇద్దరు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులు యెమెన్లోని కీలకమైన ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
సైనిక వర్గాల సమాచారం ప్రకారం, ఎర్ర సముద్ర తీరంలోని మొఖా నగరం, దాని పరిసర ప్రాంతాలతో పాటు హొదైదా నౌకాశ్రయ నగరానికి దక్షిణంగా ఉన్న ఖోఖా ప్రాంతంలో హౌతీ తు ఈ దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ప్రభుత్వ అనుకూల సైనిక దళాలకు చెందిన నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం వెల్లడించిన ఇద్దరు సైనిక వర్గాలు తమ పేర్లను వెల్లడించేందుకు నిరాకరించాయి. ఇదే సమయంలో ఎర్ర సముద్ర తీరంలో ప్రభుత్వ బలగాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హౌతీలు కూడా తమ దాడులను ధృవీకరిస్తూ, ఎర్ర సముద్ర తీరంలో ప్రభుత్వ సైనిక బలగాలు, వారి సైనిక సామగ్రిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ప్రకటించారు.
యెమెన్లో చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో హౌతీ ఉద్యమం కీలకమైన సాయుధ శక్తిగా ఉంది. దేశ రాజధాని సనా సహా విస్తారమైన ప్రాంతాలపై హౌతీలకు నియంత్రణ ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి అనుకూలంగా పలు సైనిక బలగాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంతాలు వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమైనవిగా ఉన్నాయి.
మొఖా, హొదైదా ప్రాంతాలు ఎర్ర సముద్రంలో నౌకాయానానికి సమీపంగా ఉండటంతో పాటు యెమెన్లోని సైనిక, వాణిజ్య కార్యకలాపాలకు కీలక ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తరచూ జరిగే దాడులు అక్కడి భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. తాజా దాడుల్లో నలుగురు సైనికులు మరణించడం, 20 మంది గాయపడటం వల్ల ప్రభుత్వ దళాలు, హౌతీల మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రతరమవుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హౌతీల తాజా దాడులతో ఎర్ర సముద్ర తీరంలో పరిస్థితిని అంతర్జాతీయ వర్గాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే యెమెన్లోని ఘర్షణలు ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఈ తరహా దాడులు మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఇది ఇజ్రాయెల్, అమెరికాలను రెచ్చగొట్టి మళ్లీ ఇరాన్ పై దాడులు చేసేందుకు ఉపకరించే చర్యగా భావిస్తున్నారు.
