మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మెటా పై కఠిన చర్యలు తప్పవని మోడీ ప్రభుత్వం జుకర్బర్గ్ కు హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీక్లపై కఠిన చర్యలకు సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ వేదికపై దాదాపు ఐదు నుంచి ఆరు గంటల పాటు తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు మూడు రోజుల గడువు విధించింది.
ఈ వ్యవహారంపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 79(3) కింద ప్రస్తుతం లభిస్తున్న “సేఫ్ హార్బర్” రక్షణను ఉపసంహరించే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
బుధవారం ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (MeitY) కార్యదర్శి ఎస్. కృష్ణన్తో మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్, గ్లోబల్ పాలసీ విభాగం ఉపాధ్యక్షుడు కెవిన్ మార్టిన్ సమావేశమయ్యారు. ప్రధానమంత్రి వీడియో తొలగింపు అంశంతో పాటు మెటా వేదికల్లో బాలలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (Child Sexual Abuse Material – CSAM) అందుబాటులో ఉండటం వంటి అంశాలపై ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
భారత చట్టాలకు పూర్తిగా అనుగుణంగా వ్యవహరించాలని, వేదికలపై ఉన్న అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం మెటాను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుపై మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.
ఈ సమావేశానికి ముందు ప్రధానమంత్రి వీడియో తొలగింపును తీవ్రంగా పరిగణించిన పార్లమెంటు సమాచార సాంకేతిక, కమ్యూనికేషన్స్ స్థాయీ సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మార్క్ జుకర్బర్గ్ మూడు రోజుల్లోగా ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చర్యలు తీసుకోవాలని, మెటాకు లభిస్తున్న సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్కు పంపిన లేఖ ప్రతిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్కు కూడా పంపినట్లు కమిటీ పేర్కొంది. జుకర్బర్గ్ నిర్దేశిత గడువులో క్షమాపణ చెప్పకపోతే ఆయనను ప్రచురణకర్త (Publisher)గా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది.
విద్యార్థులు, జెన్-జెడ్ యువతను ఉద్దేశించి పరీక్షల వివాదాలు, ప్రశ్నపత్రాల లీక్ల నివారణపై ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్ నుంచి ఐదు నుంచి ఆరు గంటల పాటు తొలగించడం అత్యంత తీవ్రమైన అంశంగా కమిటీ అభివర్ణించింది.
ఇటీవల ఆగస్టు 3న పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర హోంశాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు స్నాప్చాట్, గూగుల్, ఎక్స్, మెటా (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్), యూట్యూబ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. భారత చట్టాల ప్రకారం సోషల్ మీడియా, డిజిటల్ వేదికల నియంత్రణ, వాటి బాధ్యతలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
సోషల్ మీడియా వేదికలపై బాలలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSAM), మహిళలను కించపరిచే కంటెంట్ అందుబాటులో ఉండటంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ను వెంటనే తొలగించని మధ్యవర్తి వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 79(3) ప్రకారం, మధ్యవర్తి సంస్థలు చట్టవిరుద్ధమైన కంటెంట్ను తక్షణమే తొలగించడంలో విఫలమైతే వారికి లభించే సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిటీ స్పష్టం చేసింది.
