ముఖ్యంశాలుహోమ్

పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం

#CMReview

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. పోలవరం వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ సూచన చేశారు.

ఈ మేరకు అధ్యయనం చేయడంతోపాటు… ఎకనమిక్ ఫీజిబిలిటీపై స్టడీ చేయాలన్నారు. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున్న వివిధ రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ… విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో పాటు… ప్రతి ఆరేళ్లకూ విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని… దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్‌ పంపిణీ నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు.

సోలార్‌ విద్యుత్‌పై మరింత దృష్టి

సౌర విద్యుత్‌ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్‌ కింద 6 లక్షల సోలార్‌ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఇన్‌స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్య ఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు.

ఇక కుసుమ్‌ పథకం కింద లక్ష్యాన్ని పూర్తిచేస్తూనే, అదనంగా 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ ధరకు, నిరంతర విద్యుత్‌ అందించే వ్యవస్థను రూపొందించాలని సూచించారు. దీంతో పాటు విద్యుత్‌ కొనుగోలను ఈ ఏడాది యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు.

2029 నాటికి యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు ధరను రూ.4కు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ ధర విద్యుత్‌ కొనుగోలుతోపాటు పవర్ స్వాపింగ్, కుసుమ్‌, సూర్యఘర్‌, పునరుత్పాదక విద్యుత్‌, స్టోరేజ్‌ వంటి వివిధ మోడళ్లను ఇంటిగ్రేట్ చేయాలన్నారు.

విద్యుత్‌ సంస్థలకు రేటింగ్‌… కార్పొరేట్లతో పోటీ

రాష్ట్రంలోని ఆరు విద్యుత్‌ సంస్థలకు పనితీరు ఆధారంగా రేటింగ్‌ విధానం తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రతి సంస్థ సమర్థంగా పనిచేసేలా లక్ష్యాలు నిర్దేశించి, కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా విద్యుత్‌ సంస్థలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. సంస్థల పనితీరు, ఆర్థిక సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యాలను నిరంతరం సమీక్షించాలని చెప్పారు.

విద్యుత్ కొనుగోళ్లల్లో ఆప్టిమైజేషన్ ద్వారా రూ.234 కోట్లు, ప్రాంప్ట్ పేమెంట్ రిబేట్ కింద రూ.100 కోట్లను ఆదా చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ… విద్యుత్‌ సంస్థలపై రుణ భారాన్ని తగ్గించాలన్నారు. విద్యుత్ సంస్థల రుణాలపై నిరంతర సంప్రదింపులతో వడ్డీరేట్లను వీలైనంత మేర తగ్గించాలని ఆదేశించారు.

సంస్థల పనితీరు మెరుగుపడుతున్న విషయాన్ని ఆర్థిక సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆస్తుల కల్పన, మూలధన పెట్టుబడుల కోసం మాత్రమే ఇకపై విద్యుత్ సంస్థలు అప్పులు తీసుకోవాలి తప్ప… ఇతర అవసరాలకు అప్పులు చేసే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.

టారిఫ్‌ పెంచకుండా… కొనుగోలు వ్యయం, వడ్డీ భారం, పంపిణీ నష్టాలను తగ్గించడం ద్వారా సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్‌ సంస్థల్లో డిజిటల్‌ ట్విన్‌ వ్యవస్థ, అసెట్‌ హెల్త్‌ ఇండెక్స్‌ విధానాలను అమలు చేస్తున్న అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.

విద్యుత్‌ వ్యవస్థలోని ఆస్తుల పరిస్థితిని డిజిటల్‌గా పర్యవేక్షించడం, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర పరికరాల కండీషన్ ను ముందుగానే అంచనా వేసి మరమ్మతులు, మార్పులకు చర్యలు తీసుకోవడం ద్వారా వ్యయాన్ని తగ్గించడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ ను వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి, విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

Satyam News

రెడ్ అలర్ట్:  భారీ వర్షాలతో మునిగిపోయిన ఢిల్లీ

Satyam News

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

Satyam News

కృత్రిమ గర్భనిరోధక పద్ధతులపై విముఖత

Satyam News

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్‌: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌

Satyam News

Leave a Comment