రోజువారీ కూలి పనితో జీవనం సాగించే ఒక వ్యక్తి రూ.35 కోట్లు జీఎస్టీ బకాయి పడ్డాడు….. ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే ఇది నిజమే. మొగా జిల్లా బోహ్నా చౌక్కు చెందిన కూలీ అజ్మేర్ సింగ్ తనకు జీఎస్టీ శాఖ నుంచి నోటీసులు రావడంతో మనలాగే అవాక్కయిపోయారు.
ఇంత భారీ మొత్తం తన పేరుకు ఎలా వచ్చిందో తనకు అర్థం కాలేదని అజ్మేర్ సింగ్ చెప్పారు. అజ్మేర్ సింగ్ చెప్పిన దాని ప్రకారం, ఇదే మొదటి సంఘటన కాదు. 2022లో కూడా అతనికి రూ.21 లక్షల జీఎస్టీ నోటీసు వచ్చింది. ఆ సమయంలో జీఎస్టీ కార్యాలయాన్ని సంప్రదించి విచారణ చేయాలని కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రెండు సంవత్సరాల తరువాత మరింత ఎక్కువగా రూ.35 కోట్ల నోటీసు జారీ చేశారు. నోటీసు రావడంతో అజ్మేర్ సింగ్ లూధియానా జీఎస్టీ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ‘సీ కే ఇంటర్నేషనల్’ అనే నకిలీ సంస్థ ఆయన ఆధార్, పాన్ వివరాలను ఫోర్జరీ చేసి తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిసింది.
లూధియానా గిల్ రోడ్ ఇండస్ట్రియల్ ఏరియా చిరునామాతో జీఎస్టీ నంబర్ తీసుకొని, కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్టు బయటపడింది. కోవిడ్ కాలంలో రేషన్ పంపిణీ కోసం ఒక సంస్థ ఆధార్ కార్డులు సేకరించినప్పుడు తన పత్రాలు దుర్వినియోగం అయ్యి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
“నాకు పాన్ కార్డ్ కూడా లేదు… ఎప్పుడూ తీసుకోలేదు,” అని అజ్మేర్ చెప్పారు. విషయాన్ని తెలుసుకున్న జీఎస్టీ అధికారులు అతనికి పోలీసుల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దాని మేరకు అజ్మేర్ సింగ్ మొగా సిటీ సౌత్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేసి, నకిలీ కంపెనీ నమోదులో పాల్గొన్నవారిపై పూర్తి దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కోరారు.
స్థానిక కౌన్సిలర్ జగజిత్ సింగ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పేద వ్యక్తి పత్రాలను దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరపడం ఘోరమైన మోసమని, ఇది ప్రభుత్వానికి కూడా నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అజ్మేర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారని, తదుపరి చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు.
