ఎర్రబస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు.. 2019 ఎన్నికలకు ముందు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. పార్టీ అధికారంలోకి వస్తే ఎయిర్పోర్టు కోసం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తాను అని హామీ కూడా ఇచ్చారు.
కట్ చేస్తే.. ఏడేళ్ల తర్వాత భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతోంది. ఆనాడు ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అదే జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు ఆ విమానాశ్రయం నిర్మాణం క్రెడిట్ అంతా తనదేనని సోషల్ మీడియాలో చాంతాడంత సోది రాసుకొచ్చారు.
వైసీపీ హాయంలోనే ఎయిర్పోర్టు ఆలోచన వచ్చినట్లు.. అన్ని పనులు జగన్ పాలనలోనూ పూర్తయినట్లు.. కట్టుకథలు చెప్పారు. కానీ ఈ డిజిటల్ యుగంలో సమస్త సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటంతో.. జగన్ చెప్పినవన్నీ అబద్దాలే అని తేలిపోయింది. నిజానికి 2015 ఫిబ్రవరిలో.. బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలోనే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం గురించి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.
2015 ఫిబ్రవరి 25న జీవో నెం.63 ద్వారా ఎయిర్పోర్టు నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసింది కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వమే. 2016 జనవరిలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి కేంద్రం నుంచి అప్రూవల్తో పాటు.. సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుదే. 2016 జూన్లో ఎయిర్పోర్టు కోసం సేకరించే భూములకు అత్యధిక పరిహారం నిర్ణయించి రైతులకు నష్టం లేకుండా భారీ ప్యాకేజీ ఇచ్చింది నాటి సీఎం చంద్రబాబు.
మోడీ 1.0లో కేబినెట్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు సహకారంతో.. కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు సర్కారే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమాయానికి.. అన్ని అనుమతులు తీసుకొచ్చి.. భూసేకరణ చేసి.. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. ఐదేళ్ల పాలనలో పనులు పూర్తి చేసి ఓపెనింగ్ చేసి ఉంటే.. అప్పుడే ఫుల్ క్రెడిట్ జగన్కి దక్కేది. కానీ చేజేతులా ఆ అవకాశం వదులుకొని.. ఇప్పుడు పని పూర్తి చేసిన చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని రివర్స్ ఆరోపణలు చేయడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం.
2024 అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు పనులపై ఫోకస్ చేసిన సీఎం చంద్రబాబు.. రెండేళ్లు తిరగముందే రన్వేపై తొలి ఫ్లయిట్ ల్యాండ్ అయ్యేలా చేశారు. ప్రాధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడం ద్వారా.. విశాఖపట్నం సిటీకి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తీసుకొచ్చారు. ఏదైనా భారీ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నా.. అది నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని చెప్పడానికి.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలువెత్తు ఉదాహరణ నిలుస్తోంది.
