కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజ డిజిటల్స్ అధినేత నేరెళ్ల తేజ సాయి వెంకట్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని IVF రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గోంట్ల మోహనరావు విడుదల చేశారు. చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన తేజ, విస్తృత సేవా కార్యక్రమాలతో పెద్దల దృష్టిని ఆకర్షించి, వైశ్య సమాజంలో విశేషంగా పేరు తెచ్చుకున్నారు.
ఉయ్యూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా, కృష్ణా జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా, ఉయ్యూరు మండల అవోపా అధ్యక్షుడిగా, రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన తేజ, తన కృషి, నాయకత్వంతో అన్ని పదవులకు వన్నె తెచ్చారు. ఆయన సేవలను గుర్తించిన IVF అగ్రనాయకత్వం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని అప్పగించింది.
తండ్రి నేరెళ్ల వేణుగోపాల్ స్థాపించిన “తేజ ఫౌండేషన్” ఆధ్వర్యంలో తేజ సాయి వెంకట్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు అన్నదానం, విద్యార్థులకు విద్యాసహాయం, రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగ కేంద్రాల్లో సేవలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు వంటి సేవల ద్వారా ప్రజల మన్నన పొందారు. ఉయ్యూరు మండల ఆర్యవైశ్య యువదళం పేరిట వైశ్య వర్గాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘపరంగా అందరి ప్రశంసలు అందుకున్నారు.
తేజ నియామకంపై వైశ్య వర్గాల నాయకులు, స్థానిక ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు, వాసవీ సేవా దళ్ చైర్మన్ నెరేళ్ల వేణుగోపాల్, ఉయ్యూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాజేటి శ్రీను తదితరులు తేజకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
