అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి సాగించిన భూ బాగోతాలపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్ సీరియస్ అయ్యారు. కేతిరెడ్డి అక్రమాలకు వత్తాసు పలుకుతూ తప్పుడు నివేదికలు ఇచ్చిన ఇద్దరు తహశీల్దార్లకు సీఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది.
గతంలో నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో కేతిరెడ్డికి చెందిన ‘గుర్రాల కోట’ మరియు భారీ ఫామ్ హౌస్ వ్యవహారం మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ధర్మవరం చెరువుకు చెందిన సుమారు 20 ఎకరాల భూమిని ఆక్రమించి అక్కడ విలాసవంతమైన ఫామ్ హౌస్, గుర్రాల కోట, మరియు బోటింగ్ కేంద్రాన్ని నిర్మించారని తుంపర్తికి చెందిన పరమేష్ అనే వ్యక్తి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు.
కేతిరెడ్డి అక్రమ కట్టడాలు సర్వే నంబర్ 661లో (చెరువు భూమి) ఉన్నప్పటికీ, అవి అక్కడ లేవని, సర్వే నంబర్ 904లో ఉన్నాయని అప్పటి ఎమ్మార్వో యుగేశ్వరీదేవి తప్పుడు నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించినట్లు విచారణలో తేలింది. అలాగే, మరో ఎమ్మార్వో నీలకంఠారెడ్డి కార్యాలయ రికార్డులను సైతం పరిశీలించకుండా కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో 2.42 ఎకరాల అసైన్డ్ భూమిని వెబ్ల్యాండ్లో నమోదు చేసినట్లు సీఎస్ గుర్తించారు.
ఈ అక్రమాలపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, ఆ ఇద్దరు అధికారులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా, తనపై వచ్చిన ఆరోపణలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
