గన్నవరం విమానాశ్రయంపై తుఫాన్ “మొంథా” ప్రభావం తీవ్రంగా కనిపించింది. సాధారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, కడప, విశాఖపట్నం వంటి నగరాల నుంచి రోజూ 21 విమానాల రాకపోకలు జరిగే గన్నవరం ఎయిర్పోర్టులో మంగళవారం భారీ అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతో మొత్తం 16 విమాన సర్వీసులను రద్దు చేశారు.
ఇందులో ఇండిగో ఎయిర్లైన్స్ 9 సర్వీసులను రద్దు చేయగా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ షార్జా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ సర్వీసులను రద్దు చేసింది. ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీ, ముంబై సర్వీసులను రద్దు చేసినట్లు అధికారిక సమాచారం. తుఫాన్ ప్రభావం కారణంగా ఎయిర్పోర్టు పరిసరాల్లో వర్షాలు, గాలులు కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని గన్నవరం ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విమాన సర్వీసులు పునరుద్ధరించే విషయంపై వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
