దుబాయ్ ఎయిర్షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్షో ప్రదర్శన లో పాల్గొంటున్న భారత యుద్ధ విమానం శుక్రవారం ప్రమాదానికి గురైంది. భారత వాయుసేన వినియోగించే HAL తేజస్ ఫైటర్ జెట్ మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ప్రేక్షకుల ముందు ఎగురుతున్న సమయంలో కుప్పకూలినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. పైలట్ బయటకు దూకాడా లేదా ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అన్న వివరాలు తక్షణం అందుబాటులోకి రాలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో నల్లటి పొగ మేఘాలు ఎగసిపడ్డాయి. అక్కడికి వచ్చి ఉన్న ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అత్యవసర సేవలు అందించే శకటాలు అక్కడకు చేరుకుని సేవలు అందించాయి. ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే దుబాయ్ ఎయిర్షో ఈసారి భారీ విమాన ఆర్డర్లతో ప్రత్యేకంగా నిలిచింది.
ఎమిరేట్స్ మరియు ఫ్లైదుబాయ్ సంస్థలు పలు ప్రధాన ఆర్డర్లు ప్రకటించిన సమయంలోనే ఈ ప్రదర్శన విమానం ప్రమాదం చోటుచేసుకోవటం ఆ కార్యక్రమాన్ని కాసేపు స్థంభింపజేసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పరిశీలిస్తున్నారు.
