మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్పై భారీ ఎయిర్స్ట్రైక్స్ నిర్వహించింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 31 మంది మరణించగా, 149 మంది గాయపడ్డారు.
మృతుల్లో సుమారు రెండు మూడొంతులు దక్షిణ లెబనాన్ ప్రాంతానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఇక కువైట్లో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడి అమెరికన్లకు అమెరికా అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. “రాయబార కార్యాలయానికి రావద్దు, సురక్షిత ప్రదేశాల్లోనే ఉండండి” అని సూచించింది. ఇదిలా ఉండగా, ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి అలీ లారిజానీ ఎక్స్లో స్పందిస్తూ “అమెరికాతో మేము ఎలాంటి చర్చలు జరపము” అని స్పష్టం చేశారు.
ఇరాక్లో ప్రో-ఇరానియన్ మిలీషియా బగ్దాద్ విమానాశ్రయం వద్ద ఉన్న అమెరికా సైనిక దళాలపై డ్రోన్ దాడి చేసినట్లు ప్రకటించింది. ఉత్తర ఇరాక్లోని ఇర్బిల్లోని అమెరికా స్థావరంపై కూడా దాడి చేసినట్లు పేర్కొంది. సైప్రస్లోని బ్రిటిష్ సైనిక స్థావరంపై కూడా డ్రోన్ దాడి జరిగిందని సమాచారం. ఇక ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ క్షిపణి కేంద్రాలు, నౌకాదళ స్థావరాలపై దాడులు జరిపినట్లు ప్రకటించాయి.
ఇరాన్ నేతల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ హత్యకు ప్రతిగా మరియు “ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా” ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఒక క్షిపణిని అడ్డుకున్నట్లు, మరికొన్ని ఖాళీ ప్రదేశాల్లో పడినట్లు తెలిపింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బీరూట్పై వైమానిక దాడులు కొనసాగిస్తూ, తూర్పు మరియు దక్షిణ లెబనాన్లోని దాదాపు 50 గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించింది. దీంతో ప్రజలు భయాందోళనల మధ్య ప్రాంతాలు విడిచిపెడుతున్నారు.
శనివారం జరిగిన అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖొమైనీ సహా పలువురు ఇరాన్ కీలక అధికారులు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాలపై క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా, కువైట్లో ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్పై ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించాయి. మొత్తం మీద మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతూ, పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతోంది.
