అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నుంచి ఎగ్జిట్లే కానీ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్లు కనిపించడం లేదు. ఇతర పార్టీల నుంచి ఎవరూ రాకపోవడంతో.. సస్పెన్షన్లో ఉన్న సొంత పార్టీ నేతలనే తిరిగి తీసుకొనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
బడ్జెట్ సమావేశాల మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు.. పదకొండు నిముషాల్లోనే ప్యాకప్ చెప్పి.. శాసనసభ బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబు.. జగన్ పక్కన కనిపించడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల ముందు నేరం ఒప్పుకొని కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ప్రజలతో పాటు పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. పేరుకి ఆయన మీద సస్పెషన్షన్ వేటు వేసినా.. అనంతబాబు ఎప్పుడు జగన్ పక్కన కనిపిస్తూనే ఉన్నారు.
అసెంబ్లీ ముందు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళన కార్యక్రమంలోనూ అనంతబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా శాసనసభ ముందు జగన్ను కలిశారు. భార్య వాణిని వదిలేసి.. మాధురితో సహజీవనం చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో.. వైసీపీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. జగన్తో కనిపించడంతో.. వీరిపై సస్పెన్షన్ ఎత్తేసి.. మళ్లీ పార్టీలోకి తీసుకొంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో వైసీపీ వాయిస్ వినిపించే నాయకులే కనిపించడం లేదు. ఎవరూ లేనప్పుడు అందుబాటులో ఉన్న అనంతబాబునే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఉత్తరాంధ్రలో బొత్స, ధర్మాన ఫ్యామిలీలు యాక్టివ్గా ఉన్నా వీళ్లు వైసీపీ మార్క్ పోలిటిక్స్ చేయడం లేదు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ మాదిరిగా నోరు పారేసుకొని పరువు తీసుకొనే పనులు చేయాలంటే దువ్వాడ శ్రీనివాస్ని మించిన ఆప్షన్ కనిపించడం లేదు. ఫార్మల్గా సస్పెన్షన్ ఎత్తేయకపోయినా.. అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ సేవలను వైసీపీ పెద్దలు వాడుకొన్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
