టాటా గ్రూప్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన టాటా గ్రూప్ ప్రధాన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ చైర్మన్గా కొనసాగనున్నట్లు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఆయన ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉంది.
భారత్కు చెందిన సుమారు 400 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్లో 30కి పైగా కంపెనీలను టాటా సన్స్ నియంత్రిస్తోంది. వీటిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా వంటి కీలక సంస్థలు ఉన్నాయి. అయితే టాటా సన్స్లో 66 శాతం వాటా టాటా ట్రస్ట్స్దే. టాటా ట్రస్ట్స్ గ్రూప్కు చెందిన ప్రధాన దాతృత్వ సంస్థ.
చంద్రశేఖరన్ను మరోసారి టాటా సన్స్ చైర్మన్గా నియమించే అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఆయన పునర్నియామకాన్ని వ్యతిరేకించినట్లు గతంలో రాయిటర్స్ పేర్కొంది. టాటా సన్స్ను ఎప్పటికీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో పాటు పలు షరతులను నోయెల్ టాటా ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే టాటా సన్స్ ఎప్పటికీ లిస్ట్ కాదనే హామీ ఇవ్వడానికి చంద్రశేఖరన్ అంగీకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
టాటా సన్స్ బోర్డులో ప్రాతినిధ్యం విషయంలోనూ చంద్రశేఖరన్ వర్గానికి, టాటా ట్రస్ట్స్కు మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. తాజా రాజీనామా వెనుక ఈ విభేదాలు ఎంతవరకు ప్రభావం చూపించాయన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. టాటా సన్స్ ఈ విషయంపై వెంటనే స్పందించలేదు. చంద్రశేఖరన్ను కూడా వ్యాఖ్య కోసం సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు.
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్లో చేరారు. అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో కీలక బాధ్యతలు చేపట్టి 2009లో ఆ సంస్థ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి టాటా గ్రూప్ను నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
గత ఏడాది కాలంలో టాటా గ్రూప్ పలు సవాళ్లను ఎదుర్కొంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఆ సంస్థపై నియంత్రణ సంస్థల పరిశీలన పెరిగింది. మరోవైపు టీసీఎస్ ధరలపై ఒత్తిడిని ఎదుర్కొంది. టాటా గ్రూప్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్పై జరిగిన సైబర్ దాడి కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడింది.
టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు కొత్తవి కావు. 2016లో అప్పటి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీని బోర్డు తొలగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రూప్లో కార్పొరేట్ గవర్నెన్స్ అంశాలపై సైరస్ మిస్త్రీ, టాటా గ్రూప్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రతన్ టాటా మధ్య విభేదాలు ఏర్పడిన తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించారు. ఆ పరిణామం అనంతరం ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది.
తాజాగా చంద్రశేఖరన్ రాజీనామా, టాటా సన్స్-టాటా ట్రస్ట్స్ మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో చోటుచేసుకోవడం టాటా గ్రూప్ భవిష్యత్ నాయకత్వంపై ఆసక్తిని పెంచుతోంది. అయితే చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు, అంటే ఫిబ్రవరి వరకు చైర్మన్గా కొనసాగనున్నట్లు సమాచారం.
