రాజమండ్రిలో జరిగిన ఒక దారుణ సంఘటనలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రియాంక భౌతిక కాయానికి మంత్రి వాకిటి శ్రీహరి నివాళి అర్పించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో మెడికో విద్యార్థిని ప్రియాంక భౌతికకాయాన్ని ఆయన సందర్శించారు. ఆయనతో బాటు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా నివాళులు అర్పించారు. అనంతరం ప్రియాంక తండ్రిని పరామర్శించిన మంత్రి శ్రీహరి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నిందితులు చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రియాంక ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తమకు, అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు.
