వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని స్పెషల్ ఇన్వెస్టిగేషణ్ టీమ్ విచారణలో తేలింది. ఈ మేరకు సిట్ అధికారులు హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం 173 మంది సాక్ష్యులను విచారించి.. ఫోరెన్సిక్ డేటా ఎనాలసిస్తో గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన అక్రమాల గుట్టు బయటపెట్టింది.
సిట్ నివేదిక ప్రకారం ఒకే జవాబు పత్రాలకు మూడు సార్లు వాల్యుయేషన్ నిర్వహించారు. ఇది ఏపీపీఎస్సీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మొదట డిజిటల్ పద్ధతిలో వాల్యుయేషన్ నిర్వహించి.. తర్వాత భౌతిక విధానంలో హాయ్ ల్యాండ్లో మూల్యాంకనం చేశారు. ఓఎంఆర్ షీట్లు, ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్కి అర్హులైన నిపుణులు ఉన్నా వారిని పక్కనపెట్టి.. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం నిర్వహించారు. మూడోసారి మూల్యాంకనం కోసం కొత్త ఓఎంఆర్ షీట్లను ముద్రించడంలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని సిట్ అధికారులు నిర్ధారించారు.
గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ఎంపికైన మొత్తం 165 మంది అభ్యర్ధుల్లో 160 మంది జవాబు పత్రాలు, మార్కుల్లో మార్పులు, చేర్పులు జరిగినట్లు సిట్ నివేదిక స్పష్టం చేసింది. సమాధాన పత్రాల్లో వైట్నర్తో కరెక్షన్లు చేసినట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన నియామక ప్రక్రియలో పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి మూల్యాంకనం, పోస్టింగ్ల వరకు అడుగడునా అక్రమాలు జరిగాయని సిట్ విచారణ నిర్ధారించడం సంచలనం సృష్టిస్తోంది.
కూటమి పాలనలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై ఫేక్ ఆరోపణలతో కృత్రిమ ఉద్యమాలు చేస్తున్న వైసీపీ నాయకులు.. వారి పాలనలో జరిగిన గ్రూప్ వన్ అక్రమాలకు బాధ్యత తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైసీపీ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలపై అభ్యర్ధులే కోర్టుకు వెళ్లి.. విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు. డీఎస్సీపై వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లినా.. అక్రమాలు జరిగాయి అనడానికి ఆధారాలు చూపించలేకపోయారు. అక్రమాలు, అవినీతితో బురద అంటించుకున్న వైసీపీ.. కూటమి ప్రభుత్వానికీ అదే బురద పూసి.. ఇద్దరికీ తేడా లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ డీఎస్సీ మీద వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు, ఇచ్చిన వివరణలు.. గ్రూప్ వన్ అక్రమాలపై వైసీపీ నాయకుల రియాక్షన్ చూస్తే.. రెండు ప్రభుత్వాలకు ఎంత తేడా ఉందో అర్ధమవుతుంది
