ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఆ ఏర్పాట్లపై మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ లు మార్కాపురం జిల్లా కలెక్టర్, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, టీడీపీ ఇంచార్జ్ లతో బుధవారం జూమ్ వేదికగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కలను సీఎం చంద్రబాబు నిజం చేశారన్నారు. ఈ నెల ఆఖరులో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులతోపాటు నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నదని చెప్పారు.
అందులో భాగంగా తొలి విడత రూ.318 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇక మిగిలిన 4,761 కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లలో త్వరలోనే రూ.300 కోట్లు జమ చేస్తామన్నారు. చివరి విడత రూ.300 కోట్లు త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వెలుగొండ నిర్వాసిత గ్రామాల్లో నిర్వాసితులను త్వరితగతిన ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.
