తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి కేసు ఫైనల్ స్టేజ్కు చేరింది. ఒక్కొక్కటిగా చిక్కుముళ్లను విప్పుతోంది సీబీఐ సిట్. ఇప్పుడు గుట్టు బయటపడే సమయం దగ్గర పడింది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా సహా ఇతర డెయిరీల నుంచి కిలో కల్తీ నెయ్యికి రూ.25 చొప్పున కమీషన్ వసూలు చేశారని CBI గుర్తించింది. ఆ కమిషన్ మొదటగా అప్పటి TTD ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పీఏ, చిన్న అప్పన్నకు చేరిందని సిట్ గుర్తించింది. ఈ మేరకు సిట్ తరఫున సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ పీఎస్పీ సురేశ్కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఐతే..ఎవరి ఆదేశాలతో ఈ కమీషన్ వసూలు చేశారో ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు సురేష్ కుమార్. హవాలా మార్గంలో చిన్న అప్పన్నకు సొమ్ము చేరిందన్నారు. రూ.కోట్లలో బ్యాంక్ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఒక్క విశాఖపట్నంలో చిన్న అప్పన్న పేరిట 14 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కల్తీనెయ్యి సరఫరా జరిగిన టైంలో TTD అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చిన్న అప్పన్న PAగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తెచ్చారు సురేష్ కుమార్. ఆ సమయంలో వినియోగించిన ఫోన్లను ఇచ్చేందుకు అప్పన్న నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని చిన్న అప్పన్న బెయిలు పిటిషన్ కొట్టేయాలని కోరారు.
కల్లీ నెయ్యి కేసులో చిన్న అప్పన్న, ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం అప్రూవర్లుగా మారినట్లు స్పష్టమవుతోంది. అన్ని విషయాలు సీబీఐ సిట్కు చెప్పేస్తున్నారు. చిన్న అప్పన్న కేవలం ఓ మధ్యవర్తి మాత్రమే. ఆయనకు పైన ఉన్న ఎవరో ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేసే వ్యక్తి. అంతకు మించి చిన్న అప్పన్నకు ఏది తెలియదు. ఇప్పుడు ఆయనకు ఆదేశాలు ఎవరు ఇచ్చారన్నది తేలాల్సి ఉంది.
అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే..!
నెయ్యి కల్తీ వ్యవహారంలో అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఇప్పటికి కస్టడీలో కెమికల్ సరఫరా చేసిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఆ లింకులు కూడా బయటకు వస్తున్నాయి. హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బులు సూత్రధారికి చేరాయని సిట్ గుర్తించింది. ఆ సూత్రధారి ఎవరన్నది కూడా సిట్ గుర్తించింది. కానీ ఒక్కొక్క స్టెప్ బలంగా ముందువేస్తుంది సిట్. త్వరలోనే పైనున్న కీలక వ్యక్తిని అరెస్టు చేసి విచారణ ముగించనుంది సిట్.
