అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ గ్రౌండ్లో జరిగిన ఘన కార్యక్రమంలో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన రామేశ్వర్ తెలీ, అజంతా నియోగ్, ఏజీపీకి చెందిన అతుల్ బోరా, బీపీఎఫ్కు చెందిన చరణ్ బోరో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శరబానంద్ సోనోవాల్, పవిత్రా మార్గరీటాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మరియు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరయ్యారు.
ఈ ప్రమాణ స్వీకారంతో రాష్ట్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. కార్యక్రమానికి హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. 126 సభ్యుల అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయిలో 102 స్థానాలు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 82 సీట్లు సాధించగా, మిత్రపక్షాలైన అసోమ్ గణపరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ చెరో 10 స్థానాలు దక్కించుకున్నాయి.
