రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై జరిగిన దాడి, గోరక్షణపేటలో జరిగిన చెవ్వేటి బుజ్జిబాబు హత్య ఘటనలపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ రెండు ఘటనలను తీవ్రంగా ఖండించారు.
డాక్టర్ ప్రియాంక (28)పై కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిన ఘటన అత్యంత దారుణమని పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించాల్సి రావడం ఎంతో బాధాకరమని అన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ వైద్య విద్యార్థినిపై ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకోవడం సమాజానికి మచ్చ అని ఆమె వ్యాఖ్యానించారు.
బాధితురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పురందేశ్వరి, ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని వారికి తగిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని తెలిపారు.
అలాగే రాజమహేంద్రవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరక్షణపేటలో జరిగిన చెవ్వేటి బుజ్జిబాబు హత్య ఘటనను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. పాత గొడవల నేపథ్యంలో జరిగిన ఈ దాడిలో బుజ్జిబాబు మృతిచెందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఈ హత్య కేసులో సంబంధిత నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను పురందేశ్వరి కోరారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఇటువంటి ఘటనలపై రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.
