బంగ్లాదేశ్ లో హిందువులను హతమార్చడం కొనసాగుతూనే ఉన్నది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో ఓ హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైంది. పదవీ విరమణ చేసిన హిందూ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు కలిపి నలుగురు ఇంట్లోనే హత్యకు గురైనట్లు స్థానిక మీడియా కథనం వెల్లడించింది. మృతులను 65 ఏళ్ల గణపతి చక్రవర్తి, ఆయన భార్య 50 ఏళ్ల ప్రీతిలతా చక్రవర్తి, 23 ఏళ్ల కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి, 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్ చక్రవర్తిగా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బంధువులు, సోదరుల కుమారులైన కజిన్స్ అని పోలీసులు తెలిపారు. రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ మహ్మద్ అబ్దుల్ మబూద్ ఆదివారం మీడియా సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి నిందితులు పొరుగున ఉన్న భవనం మీదుగా గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి ప్రవేశించారు. అక్కడ వారు ‘యాబా’ అనే మాదకద్రవ్యాన్ని తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పైకప్పుపై నుంచి శబ్దాలు వినిపించడంతో గణపతి అక్కడికి వెళ్లి ఇద్దరినీ ప్రశ్నించారు. తాము అక్కడ ఉన్న విషయం బయటకు వస్తుందనే భయంతో నిందితులు ఆయన భుజంపై ఉన్న పలుచని పత్తి తువ్వాలు (గమ్ఛా)తో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భర్తకు ఏమైందో తెలుసుకునేందుకు గణపతి భార్య ప్రీతిలత పైకప్పు వైపు వెళ్లగా, మెట్ల వద్దే ఆమెను కూడా వస్త్రంతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అనంతరం వారి కుమార్తె, కుమారుడిని కూడా నిందితులు హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రంగ్పూర్ నగరంలోని దాస్పారా ప్రాంతంలో ఉన్న ఆ ఇంటి తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉండగా, శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో నలుగురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబానికి ఎవరితోనూ తెలిసిన వివాదాలు, శత్రుత్వాలు లేవని పోలీసులు తెలిపారు. నిందితులను విచారిస్తూ హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు, ఘటనలో వారి పాత్రపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.
