గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో మరో కీలక మైలురాయిని అధిగమిస్తూ, యశోద హాస్పిటల్స్- సికింద్రాబాద్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్”(PFA) సాంకేతికతను విజయవంతంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న మెడ్ట్రానిక్ అభివృద్ధి చేసిన పల్స్ సెలెక్ట్ “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” సిస్టం సహాయంతో క్లిష్టమైన గుండె రిథమ్ (గుండె కర్ణికల అసమాన స్పందన) లోపాలతో బాధపడుతున్న 31, 84 ఏళ్ల ఇద్దరు పేషెంట్లకు ఈ అత్యాధునిక విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ముఖ్యంగా ఎట్రియల్ ఫైబ్రిలేషన్ (Atrial Fibrillation – AF) గుండె కర్ణికల అసమాన స్పందన వంటి గుండె రిథమ్ లోపాల చికిత్సలో ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక విధానం. ఇది నియంత్రిత విద్యుత్ పల్స్ల (Pulsed Electric Fields) ద్వారా గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాలను సృష్టించే కణజాలాన్ని మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని చికిత్స అందిస్తుంది. సాదారణ థర్మల్ అబ్లేషన్ విధానాలతో పోలిస్తే, ఈ సాంకేతికత ద్వారా అన్నవాహిక (Esophagus), ఫ్రెనిక్ నర్వ్ (Phrenic Nerve) వంటి సమీప అవయవాలకు హాని కలిగే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
ఫలితంగా చికిత్స మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవితానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ అత్యాధునిక సాంకేతికతతో యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్లో రెండు క్లిష్టమైన గుండె రిథమ్ లోపాల కేసులకు విజయవంతంగా చికిత్స అందించడం జరిగింది. పదేపదే గుండె దడ (Palpitations), ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్న 31 ఏళ్ల యువ రోగిని పరీక్షించగా, అతనికి ఎడమ ఎట్రియల్ టాకీకార్డియాతో కూడిన పారాక్సిస్మల్ ఎట్రియల్ ఫైబ్రిలేషన్ (Paroxysmal Atrial Fibrillation) ఉన్నట్లు నిర్ధారణ అయింది.
అనంతరం అత్యాధునిక Pulse Field Ablation (PFA) విధానాన్ని విజయవంతంగా నిర్వహించగా, చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకొని, ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే, తీవ్రమైన ఆయాసం కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరిన 84 ఏళ్ల వృద్ధ రోగిని పరీక్షించగా, ఆయనకు నిరంతర ఎట్రియల్ ఫైబ్రిలేషన్ (Persistent Atrial Fibrillation) ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు కూడా Pulse Field Ablation విజయవంతంగా నిర్వహించడం జరిగింది. చికిత్స అనంతరం గుండె రిథమ్ సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, గుండె స్పందన సాధారణ స్థితికి చేరడంతో స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు.
ఈ విజయవంతమైన ప్రక్రియను డాక్టర్. ఎం. ఎస్. చంద్రమౌళి, సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ & హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ ఎలక్ట్రోఫిజియాలజీ బృందంతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ & హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్. ఎం. ఎస్. చంద్రమౌళి మాట్లాడుతూ “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో ఒక విప్లవాత్మక ముందడుగు అన్నారు.
మెడ్ట్రానిక్ అభివృద్ధి చేసిన పల్స్ సెలెక్ట్ “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” సిస్టం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో, మరింత సురక్షితంగా ఎట్రియల్ ఫైబ్రిలేషన్కు చికిత్స అందించగలుగుతున్నాము. ప్రపంచ స్థాయి వైద్య సాంకేతికతను మన దేశ రోగులకు అందుబాటులోకి తీసుకురావడం యశోద హాస్పిటల్స్ లక్ష్యం అన్నారు. ఈ నూతన సాంకేతికత ద్వారా మరింత మెరుగైన ఫలితాలు, అధిక భద్రత మరియు వేగంగా కోలుకునే అవకాశాన్ని రోగులకు అందించవచ్చని డాక్టర్. ఎం. ఎస్. చంద్రమౌళి తెలిపారు.
యశోద హాస్పిటల్స్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ విభాగంలో ఎట్రియల్ ఫైబ్రిలేషన్, ఇతర గుండె రిథమ్ లోపాలకు సంబంధించిన కాంప్లెక్స్ అబ్లేషన్ విధానాలు, పేస్మేకర్ల అమరిక, ICDలు, CRT పరికరాలు, లీడ్లెస్ పేస్మేకర్లు, కండక్షన్ సిస్టమ్ పేసింగ్, అలాగే హార్ట్ ఫెయిల్యూర్కు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు నిపుణుల పర్యవేక్షణలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
