భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే విషయంలో ఎస్ఎస్ బి సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
ముఖ్యంగా సరిహద్దు నిర్వహణను ఆధునికీకరించే దిశగా సశస్త్ర సీమా బల్ నిరంతరం కృషి చేస్తుండటం సంతోషదాయకమన్నారు. డ్రోన్లు, CCTV నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, GPS ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, GIS ఆధారిత ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా SSB తన కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుండటం అభినందనీయమన్నారు.
ఉత్తర ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు లక్నోలోని ఎస్ఎస్ బీ కేంద్రానికి వచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు సైనిక వందనం సమర్పించారు. అనంతరం నేరుగా గోమతినగర్ లోని మోహన్ లాల్ గంజ్ లో ఉన్న సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బి) 4వ బెటాలియన్ లో నూతనంగా నిర్మించిన జవాన్ల బ్యారక్, సబార్డినేట్ అధికారుల మెస్, నివాస భవనాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
దీంతోపాటు గోరఖ్పూర్లోని రీజినల్ హెడ్క్వార్టర్స్, ట్రైనింగ్ సెంటర్, జాయింట్ హాస్పిటల్, మహారాజ్గంజ్లోని 22వ బెటాలియన్ భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఆయా భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.191 కోట్ల 29 లక్షలను మంజూరు చేసింది. ఆయా నిధులతో జవాన్ల బ్యారక్లు, పరిపాలనా/శిక్షణ భవనాలు, ఆసుపత్రి, సిబ్బంది నివాసాలు, రోడ్లు, STP, నీటి ట్యాంకులు, ప్రహరీ గోడలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు ఎస్ఎస్ బీ ఏడీజీ రేఖా లోహాని, ఐజీలు మీనూ చౌదరి, పారుల్ జైన్, సీపీడబ్ల్యూ సీఈ హిమాంశు పాండే తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఈ రోజు సశస్త్ర సీమా బల్ ముఖ్యమైన కార్యక్రమంలోని పాల్గొని పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల జవాన్లు, వారి కుటుంబాల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకున్న భారత ప్రభుత్వ ఆలోచనకు, నిబద్ధతకు నేటి ప్రారంభోత్సవాలు ప్రతీకలు. దేశ సరిహద్దుల్లో నిలబడి దేశ భద్రతను కాపాడే జవాన్ల కుటుంబాలకు కూడా సురక్షితమైన, గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన జీవితం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని విశ్వసిస్తున్నాం. జవానుకు తన కుటుంబ భద్రత, ఆరోగ్యం, సౌకర్యాల గురించి ఆందోళన లేకుండా ఉంటే, అతను సరిహద్దు భద్రత, దేశ సేవ అనే తన బాధ్యతలపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టగలడు.
భారతదేశ భద్రతా వ్యవస్థలో సశస్త్ర సీమా బల్ (SSB) పాత్ర ఎంతో ముఖ్యమైనది. భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే బాధ్యత ఎస్ఎస్ బిపై ఉంది. ఈ సరిహద్దు ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణుల అక్రమ రవాణాసహా ఇతర వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలపై ఎస్ఎస్ బీ నిరంతరం సమర్థవంతమైన కఠిన చర్యలు తీసుకుంటోంది.
గతంలో పోలిస్తే ఈ రోజుల్లో భద్రతా సవాళ్లు మరింత క్లిష్టంగా మారాయి. నేరస్థులు, దేశ వ్యతిరేక శక్తులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లు, సైబర్ మార్గాలు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆధునిక సాంకేతిక పరికరాల వల్ల భద్రతా బలగాల ముందు కొత్త సవాళ్లు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం మనకు అవసరంగా మారింది. సరిహద్దు నిర్వహణను ఆధునికీకరించే దిశగా సశస్త్ర సీమా బల్ నిరంతరం కృషి చేస్తుండటం సంతోషంగా ఉంది. డ్రోన్లు, CCTV నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, GPS ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, GIS ఆధారిత ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా SSB తన కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
దేశంలో వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు యూనిఫాం ధరించిన భద్రతా బలగాల పాత్ర కీలకమైనది. అత్యవసర పరిస్థితుల్లో త్వరగా స్పందించేందుకు SSBలో 18 సహాయక, రక్షణ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. SSB సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం చాలా అభినందనీయం. వైద్య శిబిరాలు, విద్యా సాయం, నైపుణ్యాభివృద్ధి, క్రీడా కార్యక్రమాలు, మహిళా సాధికారత, వివిధ అవగాహన కార్యక్రమాలు కేవలం సామాజిక కార్యక్రమాలు మాత్రమే కావు. ఇవి సరిహద్దు ప్రజల, భద్రతా బలగాల మధ్య నమ్మకానికి బలమైన పునాది వేస్తాయి. అప్రమత్తంగా ఉండే ప్రజలు భద్రతా బలగాలకు ఎంతో సహాయం చేయగలరు. సరిహద్దు ప్రాంత ప్రజలు కూడా దేశ భద్రతలో తాము భాగస్వాములమని భావించేలా, దేశ రక్షణలో తమ పాత్రను అర్థం చేసుకునేలా మనం వారిలో నమ్మకాన్ని మరింత పెంచాలి.
సశస్త్ర సీమా బల్ సాధించిన విజయాలను ప్రస్తావించేటప్పుడు, దేశ సేవలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర జవాన్లను గుర్తు చేసుకోకుండా అది పూర్తికాదు. సశస్త్ర సీమా బల్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు 51 మంది సిబ్బంది సరిహద్దు భద్రత, అంతర్గత భద్రతా కార్యకలాపాల్లో తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఆ అమర వీరులందరికీ నేను వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, గౌరవం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీర జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదు. రాబోయే రోజుల్లో కూడా సశస్త్ర సీమా బల్ (SSB) అనేక రంగాల్లో మరింత పురోగతి సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. అందులో ముఖ్యంగా తెరిచి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులకు సమర్థవంతమైన భద్రత కల్పించడం, ఆధునిక సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించడం, అంతర్గత భద్రత మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సమర్థవంతంగా పనిచేయడం, విపత్తుల సమయంలో సహాయక మరియు రక్షణ కార్యక్రమాల ద్వారా మానవ సేవ చేయడం వంటివి ఉన్నాయి.
అలాగే సరిహద్దు ప్రాంత ప్రజలతో నమ్మకం మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, తేనెటీగల పెంపకం వంటి జీవనోపాధి కార్యక్రమాల ద్వారా స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం, మొక్కలు నాటడం మరియు పర్యావరణ పరిరక్షణ, భారత్ దర్శన్ కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడం, మిల్లెట్స్, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, అలాగే మన జవాన్లు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను.
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఆధునీకరణ, కొత్త సాంకేతికతపై శిక్షణతో పాటు, జవాన్లు, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. జవాన్ల కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆధునిక నివాసాలు, మెస్ సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఆధునిక పాఠశాలలు మరియు క్రీడా పోటీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. దీని ద్వారా మన అన్ని సాయుధ పోలీసు బలగాలు మానసికంగా మరింత బలంగా తయారై, పూర్తి సామర్థ్యంతో తమ విధులను నిర్వహించేలా చేయడం మా లక్ష్యం అని అన్నారు.
