చైనా, టర్కియే ల నుంచి పాకిస్తాన్ కు యుద్ధ విమానాల రాకపోకలు ఎందుకు పెరిగాయి? ఇదే విషయం పై ఇప్పుడు భారత భద్రతా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చైనా, టర్కియే నుంచి పాకిస్థాన్కు సైనిక విమానాల రాకపోకలు పెరగడం భారత్లో భద్రతా వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. సుమారు 60 గంటల వ్యవధిలో భారీ సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్లోని వైమానిక స్థావరాలకు పలుమార్లు రాకపోకలు సాగించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, కరాచీలోని మస్రూర్ ఎయిర్బేస్లలో చైనా సైనిక రవాణా విమానాలు దిగినట్లు సమాచారం. అదే సమయంలో టర్కియేకు చెందిన సైనిక రవాణా విమానాలు కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ విమానాల ద్వారా డ్రోన్లు, ఇతర రక్షణ రంగానికి సంబంధించిన సైనిక పరికరాలను తరలించి ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే, ఎలాంటి పరికరాలను తరలించారనే అంశంపై స్వతంత్రంగా ధృవీకరించిన సమాచారం ఇప్పటివరకు అందుబాటులో లేదు.
పాకిస్థాన్, చైనా, టర్కియేల మధ్య రక్షణ సహకారం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్థాన్కు చైనా ప్రధాన రక్షణ సామగ్రి సరఫరాదారుగా కొనసాగుతోంది. మరోవైపు డ్రోన్లు, నౌకాదళ వ్యవస్థలు, ఏరోస్పేస్ టెక్నాలజీ, మానవరహిత వ్యవస్థలు వంటి రంగాల్లో టర్కియే, పాకిస్థాన్ మధ్య సైనిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.
పాకిస్థాన్లోని కీలక వైమానిక స్థావరాలకు చైనా, టర్కియే సైనిక రవాణా విమానాలు వరుసగా చేరినట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో ఈ కార్యకలాపాల ఉద్దేశం, తరలించినట్లు చెబుతున్న రక్షణ సామగ్రి వివరాలపై భారత్ భద్రతా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
