వైసీపీ సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయనను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ రవాణా టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీగా అక్రమాలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నడిచినట్లు ఈడీ గుర్తించింది. ఈ టెండర్ల ప్రక్రియ కోసం సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్అనే సంస్థను ఫ్రంట్ కంపెనీగా వాడుకున్నట్లు అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఈ దందాల వెనుక ఉన్న హవాలా మార్గాలను వెలికితీసేందుకు ప్రస్తుతం విచారణను మరింత వేగవంతం చేశారు.
ఈ కేసులో ఇప్పటికే ఈడీ వరుస అరెస్టులతో ఉచ్చు బిగిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్కెసిరెడ్డితో పాటు ఏకంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ను కూడా అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా స్వయంగా మాజీ మంత్రే అకౌంట్లోకి రావడంతో ఈ లిక్కర్ స్కామ్ బాగోతం మరింత ముదిరినట్టయింది.
ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ఈ లిక్కర్ రవాణా అక్రమాల దర్యాప్తులో ఈడీ దూకుడు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో వైసీపీకి చెందిన మరికొన్ని పెద్ద తలకాయలకు కూడా ఈ కష్టాలు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
