సముద్రం ఒడ్డున ఉన్న నగరాలకు పెనుముప్పు పొంచి ఉన్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది. సముద్ర మట్టాలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్లోని రెండు ప్రధాన తీర మహానగరాలు ముంబై, కోల్కతాలకు శాశ్వత ముంపు, ప్రజల నిర్వాసితత్వం ముప్పు పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. సముద్ర మట్టాల పెరుగుదలతో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ప్రత్యేక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్న నగరాల్లో సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా వరదలు, శాశ్వత ముంపు, ప్రజల తరలింపు ప్రమాదం తీవ్రమవుతోందని నివేదిక పేర్కొంది. భారత్కు చెందిన ముంబై, కోల్కతాతో పాటు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను కూడా ఈ ప్రమాదం అధికంగా ఉన్న నగరాలుగా గుర్తించింది. ఈ మూడు పట్టణ ప్రాంతాల్లో కలిపి 1.4 కోట్లకు పైగా ప్రజలు శాశ్వత ముంపు కారణంగా తమ నివాసాలను కోల్పోయే తక్షణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపింది.
సముద్ర మట్టం పెరుగుదలతో పాటు భూమి కుంగిపోవడం, తీర ప్రాంత వరదలు, సముద్రపు ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకురావడం వంటి పరిణామాలు భారత్ లో సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని ఐరాస హెచ్చరించింది. సముద్ర మట్టం పెరుగుతున్న సమయంలో భూమి కూడా దిగజారితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఉప్పునీరు తాగునీటి బావులు, భూగర్భ జలాలు, నేలల్లోకి ప్రవేశించడం వల్ల తాగునీటి లభ్యతతో పాటు సాగునీరు, వ్యవసాయంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇది కేవలం నివాస ప్రాంతాలకే పరిమితం కాదని ఐరాస స్పష్టం చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న ఓడరేవులు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలు, ఆసుపత్రులు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఇతర కీలక మౌలిక వసతులు సముద్ర మట్టాల నిరంతర పెరుగుదలతో పాటు తీవ్ర తుఫాన్లు, భారీ తీర వరదల ప్రభావానికి గురయ్యే ప్రమాదం పెరుగుతోందని పేర్కొంది.
సముద్ర మట్టాల పెరుగుదల వేగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుందని నివేదిక తెలిపింది. 2014 నుంచి 2023 మధ్య ప్రపంచ సగటు సముద్ర మట్టం సంవత్సరానికి సగటున 4.7 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 2024లో ఈ పెరుగుదల దాదాపు 6 మిల్లీమీటర్లకు చేరింది. ఇప్పటివరకు నమోదైన అత్యధిక వార్షిక పెరుగుదల ఇదేనని ఐరాస పేర్కొంది.
భారత్కు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, తీర ప్రాంతాల్లో అధికంగా కేంద్రీకృతమైన జనాభా, ఆర్థిక కార్యకలాపాలు, మౌలిక వసతుల కారణంగా దేశం సముద్ర మట్టాల పెరుగుదలకు మరింత సున్నితంగా మారిందని నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబై ఇప్పటికే భారీ వర్షాలు, డ్రైనేజీ సమస్యలు, తీర వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులకు సముద్ర మట్టాల పెరుగుదల తోడైతే నగరంపై ముంపు ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
గంగా-బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలోని తక్కువ ఎత్తులో ఉన్న కోల్కతాకు కూడా అనేక రకాల ముప్పులు పొంచి ఉన్నాయని ఐరాస తెలిపింది. సముద్ర ముంపుతో పాటు తీర ప్రాంత భూక్షయం, ఉప్పునీటి చొరబాటు వంటి సమస్యలు నగరాన్ని, పరిసర ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది.
భారత ఉపఖండం ఇప్పటికే తీవ్రమవుతున్న వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొంటోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇటీవలి దశాబ్దాల్లో ఆసియా ఖండం ప్రపంచ సగటు కంటే వేగంగా వేడెక్కుతోంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్ర మట్టాలు ఎగసిపడటం, హిమనదాలు కరిగిపోవడం వంటి పరిణామాలు ఈ ప్రాంతంలో వాతావరణ సంబంధిత ప్రమాదాలను మరింత పెంచుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 కోట్ల మంది ప్రజలు, అంటే ప్రతి పది మందిలో ఒకరు, అధిక ఆటుపోటు రేఖకు ఐదు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా ఇప్పటికే గణనీయమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను వేగంగా తగ్గించడంతో పాటు తీర ప్రాంతాల రక్షణ, వాతావరణ పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఐరాస పిలుపునిచ్చింది. సముద్ర తీరాల్లో సహజ రక్షణ కవచాలుగా పనిచేసే మడ అడవులను పరిరక్షించాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పింది.
కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టాల పెరుగుదలను శాశ్వతంగా అడ్డుకోవడం భవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చని, అలాంటి ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ‘మేనేజ్డ్ రిట్రీట్’ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని ఐరాస సూచించింది. సముద్ర మట్టాల పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే ముంబై, కోల్కతా వంటి తీర మహానగరాల్లో ప్రజల నివాసాలు, మౌలిక వసతులు, ఆర్థిక కార్యకలాపాలపై దీర్ఘకాలిక ప్రభావం తప్పదని నివేదిక హెచ్చరించింది.
